ఏది నిజం: అసాధారణ రీతిలో లోకేష్ ఆస్తులు!, 'జగన్'కూ కౌంటర్ పడింది..
సాక్షి లాంటి పత్రికలు తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని లోకేష్ ఆరోపించారు.12కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ ఎన్నడైనా ఆస్తుల వివరాలను ప్రకటించారా? అని లోకేష్ ప్రశ్నించారు.
అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి నారా లోకేష్ తన ఆస్తులను వెల్లడించిన తీరు వివాదస్పదమవుతోంది. గతేడాది అక్టోబర్ లో తన ఆస్తి విలువ రూ.14.5కోట్లు ఉన్నట్లు ప్రకటించిన లోకేష్.. తాజాగా దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు పెరిగినట్లుగా చూపించారు.
గడిచిన అక్టోబర్ కి ఇప్పటికీ లోకేష్ ఆస్తుల విలువ రూ.330.14కోట్లకు పెరిగినట్లు అఫిడవిట్ ద్వారా స్పష్టమవుతోంది. అయితే కేవలం కొన్ని నెలల వ్యవధిలో ఇంత అసాధారణ రీతిలో లోకేష్ ఆస్తులు పెరగడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకే ఏటా ఆస్తులు ప్రకటిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. ఇప్పుడు లోకేష్ వెల్లడించిన ఆస్తులను బట్టి చూస్తే.. అందులో వాస్తవాలపై అనుమానాలు తలెత్తుతున్న పరిస్థితి.

అసాధారణ రీతిలో పెరిగిన ఆస్తులు!
ప్రస్తుతం లోకేష్ వెల్లడించిన ఆస్తుల ప్రకారం.. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటికీ లోకేష్ ఆస్తుల విలువ సుమారుగా 21.78రెట్లు పెరిగిందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ లెక్కన లోకేష్ ఆస్తుల విలువ ఇంత భారీగా పెరగడానికి కారణం లోకేష్ అక్రమాస్తులు కూడబెట్టి ఉంటాడా? అన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
కొద్ది నెలల క్రితం విక్రయించిన లోకేష్ కుటుంబ సంస్థ హెరిటేజ్ ద్వారా ఆయనకు ఎలాంటి నగదు ముట్టలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. కేవలం హెరిటేజ్ రిటైల్ షేర్లకు బదులు ఫ్యూచర్ గ్రూప్ షేర్లు బదలాయింపు జరిగినట్లు చెప్పారు.

భార్య ఆస్తులు పెరిగి, కొడుకువి తగ్గి:
లోకేష్ అఫిడవిట్ లో పేర్కొన్న ప్రకారం ఆయన భార్య బ్రాహ్మణి ఆస్తులు 72.94శాతం పెరిగాయి. అదే సమయంలో కొడుకు దేవాన్ష్ ఆస్తులు మాత్రం 0.7శాతంగా క్షీణించాయి. గత అక్టోబర్ లో ఆస్తులు ప్రకటించిన సమయంలో భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ.12.75కోట్లుగా లోకేష్ ప్రకటించారు. తాజాగా అఫిడవిట్ లో ఆ విలువ రూ.20.05కోట్లకు చేరింది. కొడుకు దేవాన్ష్ ఆస్తులు రూ.11.32కోట్ల నుంచి స్వల్పంగా రూ.11.24కోట్లకు తగ్గాయి.

ఆ పరంగా ఇంకెంత పెరుగుతాయో?:
తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ లో వారసత్వంగా వచ్చిన ఆస్తి విలువ రూ.38.51కోట్లుగా పేర్కొన్నారు. భార్య, కొడుకుల పేరు మీద 2.3కేజీల బంగారం, 310.06క్యారెట్ల వజ్రాలు, 104.96కేజీల వెండి ఉన్నట్లు తెలిపారు. వీటికి ఉన్న మార్కెట్ లెక్క ప్రకారం చూసుకుంటే లోకేష్ ఆస్తుల విలువ మరింతగా పెరగే అవకాశముందంటున్నారు.

లోకేష్ ఏమన్నారు?:
అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తులపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో లోకేష్ ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. దేశం మొత్తం మీద పారదర్శకంగా ఏటా ఆస్తులు ప్రకటిస్తున్న కుటుంబం తమదేనని చెప్పారు.
సాక్షి లాంటి పత్రికలు తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే సాక్షి ఇలాంటి కథనాలను ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు.
ఈసీ నిబంధనలను సైతం ప్రతిపక్షం అపహాస్యం చేస్తోందని లోకేష్ విమర్శించారు.తాను ప్రకటించిన ఆస్తులపై చర్చకు తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత తీరును తప్పుబట్టారు. 12కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ ఎన్నడైనా ఆస్తుల వివరాలను ప్రకటించారా అని లోకేష్ ప్రశ్నించారు.

వాస్తవమేది?:
ఆస్తుల విషయంలో రాజకీయాలు చేస్తున్నారంటూ లోకేష్.. లోకేష్ అక్రమాస్తులు కూడబెట్టారంటూ ప్రతిపక్ష మీడియా ఎవరికి వారు బలంగా వాదిస్తున్నారు. మరి ఇందులో ఎవరిదో వాస్తవమో.. ఎంతమేర వాస్తవముందో అన్న సంగతి జనాలకు మాత్రం అర్థం కావట్లేదు. మొత్తం మీద ఎప్పటిలాగే ఇరు పార్టీల మధ్య ఇదో విమర్శనాంశంగా మారింది.












Click it and Unblock the Notifications