వివాదం: స్పీకర్ పేరుతో అసెంబ్లీ గేట్కు బ్యానర్, రేవంత్ హల్చల్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఉస్మానియా గేటుకు స్పీకర్ పేరుతో పెట్టిన బ్యానర్ వివాదానికి దారి తీసింది. సస్పెన్షన్కు గురైన తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలోకి అనుమతి లేదంటూ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు బ్యానర్ను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని మీడియా విజువల్స్ తీయడంతో పోలీసులు వెంటనే తొలగించారు.
ఆ తర్వాత అసెంబ్లీ ప్రధానమైన గేటు దగ్గరకు చేరుకున్న టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను లోనికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసులతో రమణ వాగ్వాదానికి దిగారు. తాను మాజీ సభ్యుడినని, సస్పెన్షన్కు గురైన సభ్యుడిని కాదని చెబుతూ తననెలా అడ్డుకుంటారని రమణ వాగ్వాదానికి దిగడంతో పోలీసులు ఆయనను లోనికి అనుమతించారు.
స్పీకర్ నుంచి రాతపూర్వక ఆదేశాలను చూపించే వరకు తాను కదలనని రేవంత్ అసెంబ్లీ బయటన తన కారులోనే ఉండిపోయాడు. దీంతో పోలీసులు రేవంత్ రెడ్డిని బలవంతంగా కారులో నుంచి కిందకు దింపి అరెస్ట్ చేశారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్ర రావుతో పాటు అసెంబ్లీ ప్రాంగణంలోకి చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కృష్ణారావులను టీడీఎల్పీలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.