ఏపీ స్కూల్స్ లో కరోనా: వారం రోజులకే మూడు జిల్లాల్లో టీచర్లకు, విద్యార్థులకు కరోనా, తల్లిదండ్రుల్లో భయం !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు తెరచి పట్టుమని వారం రోజులు అయ్యిందో లేదో కరోనా కలకలం మొదలైంది. పాఠశాలల్లో విద్యార్థులపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా విద్యా సంవత్సరాన్ని నష్టపోయి ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు, స్కూళ్ళు తెరిచి విద్యా బోధన చెయ్యాలని నిర్ణయించిన సర్కార్ కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ నిర్వహణపై ప్రత్యేకమైన దృష్టి సారించి భౌతిక తరగతులను నిర్వహించేలా విద్యాబోధనలో కీలక మార్పులు చేశారు.

విద్యార్థులు భవిష్యత్ దృష్ట్యా స్కూల్స్ ప్రారంభించిన ఏపీ సర్కార్
కరోనా మహమ్మారి కారణంగా చదువులో వెనుకబడిపోతున్న విద్యార్థులు ఆన్లైన్ విద్యా విధానం ద్వారా నేర్చుకున్న దానికంటే, ఆఫ్ లైన్ విద్యా విధానం ద్వారా మంచిగా విద్యను నేర్చుకోగలుగుతారు అని భావించిన సీఎం జగన్ ఆగస్టు 16వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను ప్రారంభించారు. పేద విద్యార్థుల జీవితాలలో మార్పు రావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న సీఎం జగన్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కరోనా నిబంధనలుపాటిస్తున్నామని, పాజిటివిటీ రేటు 10% కంటే తక్కువగా ఉన్న చోట స్కూల్స్ తెరిచామని స్పష్టం చేశారు.

కరోనా నేపధ్యంలో స్కూల్స్ లో కఠినంగా నిబంధనల అమలు
ఇదే సమయంలో తరగతి గదులలో 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులను ఉంచకూడదని నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్పారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే తరగతులను రోజు విడిచి రోజు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అంతేకాదు పాఠశాలల్లోనే కరోనా టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు చదువుకునేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇంతా చేసి పాఠశాలలు నిర్వహిస్తున్న ఏపీ సర్కార్ కు స్కూల్స్ లో తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

కృష్ణా జిల్లాలో 10 మంది విద్యార్థులకు కరోనా
కరోనా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతున్నారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులోని ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది. శుక్రవారం పాఠశాలలో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఈరోజు వచ్చిన ఫలితాలలో పది మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పాఠశాల అధికారులు స్కూలుకు సెలవు ప్రకటించారు. దీంతో స్కూల్ వచ్చిన మిగతా విద్యార్థులలో ఆందోళన నెలకొంది.

ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లాలలోనూ కరోనా కేసులు
ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లా ఒంగోలులో డిఆర్ ఎం మున్సిపల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు టీచర్లు ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. మరి కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో పాఠశాలలోని ఉపాధ్యాయులు ,విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోని ఓ పాఠశాలలోనూ ఐదుగురు విద్యార్థులకు కరోనా మహమ్మారి సోకింది.

తల్లిదండ్రులు, విద్యార్థుల్లో కరోనాపై ఆందోళన .. జగన్ సర్కార్ కు తలనొప్పిగా కరోనా కేసులు
శ్రీకాళహస్తి రూరల్ మండలం కాపు గున్నేరి పంచాయతీ పరిధిలోని ఎంఎంసీ కండ్రిగలోని ప్రాథమిక పాఠశాలలో 5గురు విద్యార్థినులకు కరోనా మహమ్మారి సోకినట్లు సమాచారం .దీంతో తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలలను ప్రారంభించి క్లాసులు నిర్వహిస్తామని ప్రతిపక్షాల విమర్శలను లెక్కచేయకుండా స్కూల్స్ ప్రారంభించిన వైసీపీ ప్రభుత్వానికి ఆదిలోనే హంసపాదు అన్నట్టు తాజాగా నమోదవుతున్న కరోనా కేసులు ఇబ్బందికర పరిస్థితులను కలిగిస్తున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల ఆందోళనకు కారణంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications