ఏపీ కరోనా కేసుల్లో విద్యార్థులే అధికం .. థర్డ్ వేవ్ భయం; విశాఖ జీ మాడుగుల స్కూల్ లో 19మందికి కరోనా !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. నిత్యం ఎక్కడో ఒక చోట స్కూల్స్ లో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఆగస్టు 16వ తేదీన ఏపీ ప్రభుత్వం పాఠశాలలను పునః ప్రారంభించడంతో మళ్లీ ఏపీలో స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వం స్కూల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చెయ్యగా నిబంధనలు పాటిస్తున్నా సరే కేసులు నమోదు అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో చిన్నారులే ఎక్కువగా ఉండటం గమనార్హం.
భారత్ లో కరోనా : 31 వేల కొత్త కేసులు, 318మరణాలు; అయినా రిలీఫ్ ఇస్తున్న రికవరీలు
జీ మాడుగుల గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో 19మందికి కరోనా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం అనేక జిల్లాలలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం ,పశ్చిమ గోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో పాఠశాలలలో నిత్యం కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇక తాజాగా విశాఖపట్నం జిల్లా జి.మాడుగులలో కూడా కరోనా కలకలం రేగింది. జి.మాడుగుల మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో కరోనా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో చదువుతున్న 19మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు.
వారం రోజులు స్కూల్ కు సెలవు, విశాఖ ఏజెన్సీ స్కూల్స్ లోనూ కరోనా
పాఠశాలలో మొత్తం 140 మంది విద్యార్థులు ఉండగా వారిలో కొంతమందికి కరోనా లక్షణాలు కనిపించడంతో ముందస్తు చర్యలలో భాగంగా విద్యార్థులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు . దీంతో మొత్తం విద్యార్థులలో 19 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వారిని పాడేరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాఠశాల మొత్తాన్ని శానిటైజ్ చేయించిన అధికారులు వారం రోజుల పాటు పాఠశాలకు సెలవు ప్రకటించారు.ఇదిలా ఉంటే విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం నగరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో తాజాగా ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మొత్తం పాఠశాలలో 181 మంది విద్యార్థులు ఉండగా వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది.
కరోనా కేసుల్లో చిన్నారులే ఎక్కువ .. థర్డ్ వేవ్ ఆందోళన
మరోవైపు ప్రకాశం జిల్లా లింగసముద్రం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో కరోనా కేసుల పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో నమోదవుతున్న కేసులలో ఎక్కువ భాగం విద్యార్థులే ఉండడం థర్డ్ వేవ్ ఆందోళనకు కారణం గా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ లో రోజురోజుకు కరోనా విస్తరిస్తున్న తీరు ప్రస్తుతం తల్లిదండ్రులకు భయాందోళన కలిగిస్తుంది.
రోజువారీ కేసులు అత్యధికంగా నమోదు చేసే దేశంలో టాప్ ఫైవ్ రాష్ట్రాలలో ఏపీ
థర్డ్ వేవ్ వచ్చిందా అన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతుంది. ఇటీవల ఏపీలో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం తల్లిదండ్రులకు అనుమానాలకు కారణంగా మారింది. కరోనా థర్డ్ వేవ్ ఎక్కువగా పిల్లలకు ఎఫెక్ట్ అవుతుందని నిపుణులు చెప్పిన నేపధ్యంలో పిల్లలే బాధితులుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా కేసుల నమోదు లో దేశంలో టాప్ ఫైవ్ రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. ముఖ్యంగా 1, 2 జిల్లాలో కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్న పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఏపీలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో నైట్ కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగించింది ఏపీ ప్రభుత్వం. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేసింది.