కరోనా విజృంభిస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రయత్నాలా !! .. జగన్ పై చంద్రబాబు ఫైర్
ఏపీలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నా రాజకీయ పార్టీల రాజకీయాలు మాత్రం ఆగటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినా , కరోనా ప్రబలుతున్న ఈ సమయంలో మళ్ళీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారని స్థానిక సంస్థల ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు .

ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే ఎన్నికల గురించి ఆలోచిస్తారా ?
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎన్నికలా అంటూ ప్రశ్నిస్తూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. స్థానిక ఎన్నికలపై అధికారులతో సీఎం జగన్ చర్చించినట్లు పత్రికలో వచ్చిన కథనాలను పోస్ట్ చేసిన చంద్రబాబు సీఎం జగన్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు . ప్రపంచం అంతా కరోనాతో పోరాటం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఎన్నికల గురించి ఆలోచించడం ఏంటి అని ప్రశ్నించారు. ఇక సీఎం జగన్ ఇప్పటికి కూడా గత అనుభవాలను నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదని అన్నారు.

దక్షిణ కొరియాలో బాలెట్ పద్ధతిలో ఏపీలో ఎన్నికలు .. జోకా
ప్రజల ఆరోగ్యాన్ని రాజకీయాల కోసం పణంగా పెడుతున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. కరోనా విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతుంటే ఇంత పెద్ద విపత్తును పట్టించుకోకుండా ఎన్నికల రాజకీయాలు చెయ్యటం జగన్ కు తగదని ఆయన పేర్కొన్నారు . 'ఇది జోకా ఏంటీ? జగన్ తీరు షాకింగ్' అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో దక్షిణ కొరియాలో బాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోందని ఆ పత్రికల్లో పేర్కొన్నారు.

ఏపీలో కరోనా టైమ్ లోనూ ఎన్నికల రాజకీయం
ఇక ఈ వార్తలను షేర్ చేసిన చంద్రబాబు జగన్ వైఖరి విపత్తు సమయంలో కూడా మారటం లేదన్నారు . ఏపీలో గత నెలలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. కానీ సీఎం జగన్ ఎన్నికలను నిర్వహించి తీరాలని పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ఉన్న రమేష్ కుమార్ ను తొలగించి ఆయన స్థానంలో కనగరాజ్ ను నియమిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు . ఇప్పుడు ఎన్నికల ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు సీఎం జగన్ పై మండిపడుతున్నారు .












Click it and Unblock the Notifications