ముంచుకొస్తున్న కరోనా థర్డ్ వేవ్ ముప్పు .. ఏపీ ఆస్పత్రుల్లో పెరుగుతున్న చేరికలు, తెలంగాణాలోనూ తస్మాత్ జాగ్రత్త
ఆగస్టు నెల రానే వచ్చింది. కరోనా థర్డ్ వేవ్ ఆగస్టు నెలలో ప్రారంభమై సెప్టెంబర్ లో పీక్స్ కు చేరుతుంది అన్న నిపుణుల అంచనా నిజమవుతుందా అన్న ఆందోళన ప్రస్తుతం అందరినీ వేధిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్న తీరు, ఆసుపత్రుల్లో పెరుగుతున్న చేరికలు ఆందోళనకరంగా మారాయి. అధికారిక లెక్కల కంటే అనధికారికంగా చాలామంది కరోనా బారిన పడుతున్నట్టు ఆసుపత్రుల్లో పెరుగుతున్న రద్దీ స్పష్టం చేస్తుంది.
దారుణం : కరోనా రోగిని ముఖమంతా వాచేలా కుట్టిన చీమలు .. విచారణకు ఆదేశం
భారీగా ఆస్పత్రుల్లో కరోనా కేసుల పెరుగుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఆసుపత్రిలో చేరికలు పెరగడం ఆందోళనకరంగా మారింది. జూలై 20వ తేదీ నుంచి రోజుకు సగటున 594 మంది ఆసుపత్రులలో చేరుతున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూలై 2వ తేదీ నుండి 11వ తేదీ మధ్య సగటున 197 మంది ఆస్పత్రిలో చేరగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సుమారు 600 వరకు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటుగా కేంద్రం పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు నిత్యం చూస్తూనే ఉన్నాం.
వైరస్ వేరియంట్ లలో మార్పులతో శ్వాస సమస్యలు .. ఆస్పత్రుల్లో చేరికల పెరుగుదల
ప్రస్తుతం పెరుగుతున్న ఆసుపత్రుల చేరికలు థర్డ్ వేవ్ ప్రమాదాన్ని చెప్పకనే చెబుతున్నాయి. జూన్, జూలై నెలల్లో ఒకింత తగ్గిన కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. అంతేకాదు కరోనా మహమ్మారి తీవ్రత కూడా పెరగటంతో బాధితులు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వైరస్ వేరియంట్లలో వచ్చిన మార్పుల వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్యలు తదితర కారణాలతో ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రిలో ఉన్న వారిలో 47.3 శాతంమంది ఆక్సిజన్ వార్డుల్లో, 15.6 శాతం మంది ఐసీయూలో, 4.77 శాతం మంది వెంటిలేటర్ లపై ఉన్నట్లుగా తెలుస్తుంది.
తెలంగాణా రాష్ట్రంలోనూ భారీగానే కేసులు .. కానీ అధికారిక లెక్కలు మాత్రం
కరోనా చికిత్స మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 276 ఆసుపత్రులు అందుబాటులో ఉంటే 3983 మంది ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ పరిస్థితి అదేవిధంగా ఉన్నట్టుగా సమాచారం. మళ్లీ కరోనా ఆసుపత్రులలో చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో ఆసుపత్రులలో కరోనా కేసుల రద్దీ పెరుగుతోంది అయినప్పటికీ ఇవి బయటకు రాకుండా, అధికారిక లెక్కలలో తక్కువ కేసులు నమోదైనట్లుగా చూపిస్తున్నట్లుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి పెద్దగా చర్యలు తీసుకోవటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
Recommended Video
కరోనా థర్డ్ వేవ్ .. ముప్పు ముంగిట్లో మనం ... నిబంధనలు పాటించటం అవసరం
చాలా ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇక తాజా పరిణామాలు, క్రియాశీల కేసుల పెరుగుదల కరోనా థర్డ్ వేవ్ కు సంకేతంగా భావించాల్సిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ముప్పు ముంగిట్లో మనం ఉన్నట్లుగా ప్రస్తుతం పెరుగుతున్న కేసుల తీరు స్పష్టంగా చెబుతోంది. ఈ సమయంలో కూడా అప్రమత్తంగా లేకుంటే సెకండ్ వేవ్ ను మించి థర్డ్ వేవ్ విధ్వంసం సృష్టించే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త . మాస్కులు ధరించటం , సామాజిక దూర నిబంధనలు పాటించటంతో పాటు వ్యాక్సినేషన్ చేయించుకోవటం తప్పనిసరి అని నిపుణుల సూచనలు పాటిద్దాం