ఏపీలో ప్రతీ 20నిమిషాలకో మరణం... ఆక్సిజన్ అందక,బెడ్స్ దొరక్క.. లెక్కలు దాచగలరు,కానీ కన్నీళ్ల సంగతేంటి :పవన్
విజయనగరం మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మృతి చెందటం... విశాఖపట్నం ఆస్పత్రిలో బెడ్స్ దొరక్క కరోనా బాధితులు చనిపోవడం లాంటి దురదృష్టకర ఘటనల గురించి వింటుంటే మనసు కకావికలం అవుతోందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రాణాలు నిలుపుకునేందుకు ఆస్పత్రికి వస్తే అక్కడ ప్రాణవాయువు అందుబాటులో ఉండటం లేదన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నా, అత్యవసర ఔషధమైన రెండెసివిర్ను బ్లాక్ మార్కెట్లో లక్షల రూపాయలకు అమ్ముతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. రెండెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్కి తరలించి ఒక్కో ఇంజక్షన్ను రూ.40వేలకు అమ్ముతుంటే సామాన్యులు, పేదలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోలగరని ప్రశ్నించారు.

అంబులెన్సుల కోసం... ఎన్నిసార్లు ఫోన్లు చేసినా... : పవన్
రాష్ట్రంలోని ఆస్పత్రులకు ఆక్సిజన్ సక్రమంగా అందటం లేదన్నారు పవన్. విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సైతం ఆక్సిజన్ కొరత,బెడ్స్ దొరకని కారణంగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో వేల కొద్దీ అంబులెన్సులను ఏర్పాటు చేశామని చెప్పిన ప్రభుత్వం వాటిలో రోగులను మాత్రం ఆస్పత్రులకు తరలించలేకపోతోందని విమర్శించారు. అంబులెన్సుల కోసం ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ప్రయోజనం ఉండటం లేదని రోగుల బంధువులు బాధపడుతున్నారని చెప్పారు. జిల్లాలవారీగా రెండెసివిర్ ఇంజక్షన్లకు, ఆక్సిజన్ సరఫరా కోసం ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ... అసలు ఆ అధికారులు ఏ విధంగానూ స్పందించడం లేదన్నారు. అలాంటప్పుడు అధికారులను నియమించి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఆక్సిజన్ డిమాండ్, సరఫరా... వినియోగంపై అత్యవసర ఆడిట్ చేపట్టి నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతీ 20 నిమిషాలకో మరణం.. : పవన్
రాష్ట్రంలో ప్రతీ 20 నిమిషాలకు ఒకరు కరోనాతో చనిపోతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు.కానీ అంతకంటే ఎక్కువ మంది చనిపోతున్నారని క్షేత్ర స్థాయి సమాచారం ఉందన్నారు. ఆక్సిజన్ అందక చనిపోతున్నా... అలాంటిదేమీ లేదంటూ... శ్మశానంలో శవాల లెక్కలు తప్పంటూ అధికారులు ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు. కరోనా బాధితుల మరణాల లెక్కలను ఈ ప్రభుత్వం దాయగలదు... కానీ కరోనాతో చనిపోయినవారి కుటుంబీకుల కన్నీటికి అడ్డుకట్ట వేయగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓ వైపు కరోనా ఉత్పాతం ఉంటే ఇంటింటికీ ఇంటర్నెట్ ఇవ్వడం గురించీ, మహిళలకు మేకలు, గొర్రెలు ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటింటికి కావాల్సింది ఇంటర్నెట్ మాత్రమే కాదు : పవన్
ఇంటింటికీ కావాల్సింది ఇంటర్నెట్, మేకలు మాత్రమే కాదు... కరోనా నుంచి రక్షించే మెడిసిన్, ఆక్సిజన్ కూడా అని గ్రహించాలన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ వీటిపై దృష్టి పెట్టాలన్నారు. తద్వారా మన రాష్ట్రం రోమ్ కాదు... మన పాలకులు నీరో వారసులూ కారు అని నిరూపించాలన్నారు. ఈ విపత్కర తరుణంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయడం ద్వారా విద్యార్థులను, వారి కుటుంబాలను ముప్పు నుంచి కాపాడవచ్చునని చెప్పారు.
Recommended Video

వారి సమస్యలపై దృష్టిపెట్టాలి : పవన్
కరోనా రోగుల సేవల్లో నిరంతరం నిమగ్నమై ఉన్న వైద్యులు, నర్సింగ్, ఇతరత్రా ఆస్పత్రి సిబ్బందిని ప్రతి ఒక్కరూ అభినందించాలని పవన్ అభిప్రాయపడ్డారు. రోగుల తాకిడి పెరుగుతున్న తరుణంలో సిబ్బంది సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ.. వారు ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పారు. ఎన్నో భయాందోళనల నడుమ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వారు విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు మౌలిక వసతులకు సంబంధించి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications