వావ్.. భారీగా తగ్గిన కేసులు.. ఏపీలో వెయ్యి లోపే నమోదు
కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒమిక్రాన్ కూడా అంతగా ప్రభావం చూపడం లేదు. సో.. కొత్త వేరియంట్ల భయం ఇప్పుడే లేదు. తెలుగు రాష్ట్రాల్లో.. దేశంలో కూడా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏపీలో గత 24 గంటల్లో 896 కరోనా కేసులు వచ్చాయి. కరోనా సోకిన ఆరుగురు చనిపోయారు. ఒక్కరోజులో 8 వేల 849 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24 వేల 454 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 24,066 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. శుక్రవారంతో 1,166 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం కరోనా కేసుల సంఖ్య తగ్గింది.
24 గంటల వ్యవధిలో అనంతపురం జిల్లాలో ఇద్దరు కరోనాతోతో చనిపోయారు. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14వేల 694కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,28,09,000 కరోనా టెస్టులు చేశారు. ఇటు దేశవ్యాప్తంగానూ కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది.
కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. తాజాగా కొత్త కేసులు 50 వేలకు దిగొచ్చాయి. శుక్రవారం 14 లక్షల మందికి కరోనా టెస్తులు చేయగా.. 50 వేల 407 మందికి పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. ముందురోజు కంటే కేసులు 13 శాతం మేర తగ్గాయి. పాజిటివిటీ రేటు 3.48 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు 6 లక్షల (1.43 శాతానికి) పడిపోయాయి. నిన్న ఒక్కరోజే 1,36,962 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ రెండేళ్ల వ్యవధిలో 4.25 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.14 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 97.37 శాతానికి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 804 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. క్రితం రోజుతో పోలిస్తే మరణాల సంఖ్య 657 పెరిగింది. దేశంలో ఇప్పటివరకు వైరస్తో చనిపోయిన వారి సంఖ్య 5,07,981 పెరిగింది.