కరోనా సోకిన మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమం....
టీడీపీ నేత,మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు ఆదివారం(ఏప్రిల్ 25) వైద్యులు వెల్లడించారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆరోగ్యం క్షీణించినట్లు చెబుతున్నారు.
ఈ నెల 15వ తేదీన సబ్బం హరికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. వైద్యుల సూచన మేరకు మూడు రోజులు హోం క్వారంటైన్లో ఉన్నారు. అప్పటికీ కోలుకోకపోవడంతో ఆస్పత్రిలో చేరారు.గత మూడు రోజులుగా వెంటిలేటర్పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. సబ్బం హరి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో ఆయన అనుచరులు,అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,634 కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులు 11వేల మార్క్ని దాటిన కేసులు ఇవాళ 12వేల మార్క్ని దాటాయి. మరో 69 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 10,33,560కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7685కి చేరింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 62,885 కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకూ 1,59,94,607 కరోనా టెస్టులు నిర్వహించారు. మరో 4304 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 9,36,143 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 89732 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నమోదైన కేసుల్లో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 1,680 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1628, గుంటూరు జిల్లాలో 1576, నెల్లూరు జిల్లాలో 1258, కర్నూలు జిల్లాలో 1158, అనంతపురం జిల్లాలో 1095 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 331 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన మరణాల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 12 మంది కరోనాతో మృతి చెందారు.