శాసనమండలి నూతన ఛైర్మన్-డిప్యూటీ ఖరారు..!! కౌన్సిల్ ప్రత్యేక సమావేశం : ఎంపిక లాంఛనమే..!!
ఏపీ శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. శాసనసభలో భారీ మెజార్టీ ఉన్న అధికార వైసీపీ..ఇప్పుడు శాసనమండలిలోనూ ఆధిక్యత సాధించింది. ఇదే సమయంలో శాసన మండలిలో ఛైర్మన్..డిప్యూటీ ఛైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. టీడీపీ హాయంలో ఛైర్మన్ గా ఎన్నికైన షరీఫ్..డిప్యూటీ ఛైర్మన్ గా నియమితులైన రెడ్డి సుబ్రమణ్యం ఇద్దరూ పదవీ విరమణ చేసారు. ఇప్పుడు వైసీపీ నుండి మండలిలో ఆధిక్యత సాధించటంతో అధికార పార్టీకి చెందిన వారే ఛైర్మన్..డిప్యూటీ ఛైర్మన పదవులు దక్కించుకోనున్నారు. దీని కోసం గవర్నర్ ఇప్పటికే శాసనమండలి ప్రొటెమ్ ఛైర్మన్ గా సీనియర్ సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం పై ఉత్తర్వులు జారీ చేసారు.
మండలి ప్రత్యేక సమావేశం..
ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రొటెం ఛైర్మన్ కొత్తగా గవర్నర్ కోటాలా మండలి సభ్యులుగా నామినేట్ అయిన లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్కుమార్ (వైఎస్సార్ కడప), మోషేన్రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) లతో సోమవారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జూలైలో అసెంబ్లీ - మండలి వర్షాకాల సమావేశాల పైన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వాస్తవంగా ఆ సమయంలో కొత్త ఛైర్మన్ ఎంపిక చేపట్టాలని తొలుత భావించారు. అయితే, కరోనా తీవ్రత కొంత మేర తగ్గినా..పూర్తిగా తగ్గకపోవటంతో సమావేశాల నిర్వహణ పైన ఇంకా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో..వర్షాకాల సమావేశాలు జరగక పోతే..తిరిగి శీతాకాల సమావేశాల వరకు కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో..త్వరలో శాసన మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అందులో ఛైర్మన్..డిప్యూటీ ఛైర్మన్ ఎంపిక చేపట్టాలని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.
ఛైర్మన్..డిప్యూటీ పేర్లు ఖరారు..
ప్రత్యేక సమావేశం ఫిక్స్ అవుతూనే..ఛైర్మన్ ఎన్నిక కోసం ప్రొటెం స్పీకర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అందులో నిర్ధేశించిన సమయం ముగిసిన తరువాత ఎన్నిక ప్రక్రియ చేపడతారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకగ్రీవంగా జరిగే ఈ ఎన్నికలు లాంఛనం కానున్నాయి. ఇప్పటికే ఛైర్మన్ - డిప్యూటీ ఛైర్మన్ ఎంపిక పైన ఒక స్పష్టతతో ఉన్నట్లు సమాచారం. శాసనసభలో స్పీకర్ గా ఉత్తరాంధ్రకు చెందిన బీసీ వర్గానికి కేటాయించటంతో..మండలి ఛైర్మన్ ఎస్సీ వర్గానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తోంది. సీఎం జగన్ పార్టీ ప్రకటన చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి..జగన్ తో కలిసి అడుగులు వేసిన మోషేన్ రాజు పేరు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఆయన నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
రామలసీమకు డిప్యూటీ పదవి..
అదే విధంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కోస్తా ప్రాంతానికి చెందిన వారికి ఇవ్వటంతో...మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవిని రాయల సీమకు చెందిన మైనార్టీ వర్గానికి ఇస్తారని తెలుస్తోంది. అందులో భాగంగా మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ లేదా జికయా ఖానుం పేర్లు పరిశీలిస్తుననట్లు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేక మండలి సమావేశంలో ఈ రెండు పదవుల ఎంపిక పూర్తి చేస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఇక, ప్రస్తుతం శాసన మండలిలో ఖాళీగా ఉన్న 11 స్థానాల్లో మూడు ఎమ్మెల్యే కోటాలో..ఎనిమిది స్థానిక సంస్థల కోటాలో ఎంపిక చేయాల్సి ఉంది.
కోర్టులో అప్పీల్..తేలాక ఆ స్థానాల భర్తీ
అయితే, స్థానిక సంస్థల ఎన్నిలకను హైకోర్టు రద్దు చేయటంతో..దీని పైన ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్లింది. ఈ వారంలో అది విచారణకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంటే రెగ్యులర్ సమావేశాల వరకు నిరీక్షించటం లేకుంటే..ప్రత్యేక సమావేశం ద్వారా ఛైర్మన్ ఎంపిక పూర్తి చేయాలనేది ప్రస్తుతం పార్టీలో సాగుతున్న చర్చ. దీని పైన సోమ లేదా మంగళవారం పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక, మూడు ఎమ్మెల్యే కోటాలో భర్తీ కానున్న ఎమ్మెల్సీలు సైతం వైసీపీ ఖాతాలోనే జమ కానున్నాయి. దీంతో..వైసీపీ బలం 23కు పెరగనుంది. అదే విధంగా స్థానిక సంస్థల కోటాలో జరగే ఎనిమిది సీట్ల కోసం ఎన్నికల్లో టీడీపీ ఏదైనా గెలిస్తే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.
Recommended Video