ఆ ఒక్కరోజే 3 లక్షలకు పైగా భక్తులు- చకచకా ఏర్పాట్లు
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 76,033 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 26,905 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 5.30 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

ఈ ఏడాది సెప్టంబర్ 24న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నయి. ఈ నేపథ్యంలో ఆలయం నాలుగు మాడ వీధుల్లో చేస్తున్న ఏర్పాట్లను టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్టలతో పరిశీలించారు.
ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు ఈఓ పలు ఆదేశాలు ఇచ్చారు. గ్యాలరీల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సెప్టంబర్ మొదటి వారంలోపు ఇంజినీరింగ్ పనులు మొత్తం పూర్తి కావాల్సి ఉంటుందని చెప్పారు.
సెప్టెంబర్ 24వ తేదీన సాలకట్ల బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భద్రతా చర్యలపై క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
గ్యాలరీల్లో ఉన్న ప్రతి భక్తుడికి అన్న ప్రసాదాలు అందేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న గరుడవాహన సేవకు గత ఏడాది మూడు లక్షలకు పైగా భక్తులు విచ్చేశారని, ఇప్పుడు కూడా అదే స్థాయిలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నట్లు తెలిపారు.
దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోన్నామని, ఈ ఏడాది అదనపు ట్రిప్పులు తిప్పేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించామని అన్నారు. తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తుగా పార్కింగ్ ప్రణాళికలు రూపొందించి తిరుపతిలో కూడా పార్కింగ్ లు ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వచ్చేలా చర్యలు చేపట్టామని తెలియజేశారు.












Click it and Unblock the Notifications