కొడుకుకు ఇష్టమైన ఆహారం పెట్టి, పేరెంట్స్ ఆత్మహత్య, ఫోన్ దొంగిలించాడని పొడిచారు
గుంటూరు/విశాఖ: తెనాలిలో దంపదతులు ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకుకు ఇష్టమైన ఆహారం వండిపెట్టి, పాఠశాలకు పంపించి.. ఆ తర్వాత వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో ఇది జరిగిందా? లేక కుటుంబ కలహాలా? మరింకేమైనా ఉందా? తెలియాల్సి ఉంది.
మేం ఊరెళ్తున్నామని పాఠశాలకు వెళ్లే కొడుక్కు తల్లిదండ్రులు చెప్పారు. కొడుకుకు ఇష్టమైన వంటకం వండిపెట్టారు. పాఠశాల నుంచి వచ్చేటప్పుడు ఎవరినైనా తోడు తీసుకొచ్చుకోమని కూడా చెప్పారు. కొడుకు వెళ్లాక ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు ఒంటరివాడయ్యాడు.
సెల్ ఫోన్ చోరీ చేశాడని చితకబాదారు
సెల్ ఫోన్ దొంగిలించారని ఆరోపిస్తూ గిరీష్ అనే విద్యార్థి పైన తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. గిరీష్ను సుజాత నగర్ పిలిపించి కత్తితో దాడి చేశారని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కమలాపురం వద్ద పొంగి ప్రవహిస్తున్న పాగేరు వాగు
కడప జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కమలాపురం సమీపంలోని పాగేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట- కమలాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
40 గొర్రెలు మృతి
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వడ్లూరు జాతీయ రహదారి పైన వేగంగా వస్తున్న లారీ గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు నలభై గొర్రెలు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గొర్రెల కాపరికి కూడా గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు.