ఏపీలో కరోనా: 5వేలు దాటిన కేసులు.. కొత్తగా 216మందికి వైరస్, 2మృతి..
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నంది. మంగళవారం నాటికి రాష్ట్రంలో కరోనా కాటుకు గురైనవాళ్ల సంఖ్య 5వేల మార్కు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 216మందికి వైరస్ సోకింది. అందులో స్థానికులు 147 మందికాగా, వలసదారులు, విదేశాల నుంచి వచ్చినవాళ్లు 69 మందని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,029కి పెరిగింది.

ఆలస్యంగా ప్రకటన..
ఏపీలో కరోనా లెక్కలకు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తుండగా.. వివరాల వెల్లడిలో ఆరోగ్య శాఖ ఆలస్యం ప్రదర్శించింది. సాధారణంగా కొత్త కేసులు, టెస్టుల వివరాలను ప్రతి రోజు ఉదయం 11 నుంచి 12 గంటల్లోపే ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేయాల్సిఉంది. మంగళవారం మాత్రం సాయంత్రం 6 తర్వాతగానీ బులిటెన్ విడుదలకాలేదు. అయితే, సీఎం టెలీకాన్ఫరెన్స్ లో అధికారులు పాల్గొనడం వల్లే ప్రకటన ఆలస్యమైందని సీఎంవో వర్గాలు వివరణ ఇచ్చాయి.

మరో ఇద్దరు మృతి..
ఏపీలో కరోనా కారణంగా చనిపోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో మరొకరు ప్రాణాలు కోల్పోయినట్లు హెల్త్ మినిస్ట్రీ బులిటెన్ లో పేర్కొన్నారు. తద్వారా మొత్తం మరణాల సంఖ్య 77కు పెరిగింది. తాజా కేసులతో ఏపీ కేసుల సంఖ్య 5,029కి చేరగా.. అందులో స్థానికులు 3990 మందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 907, విదేశాల నుంచి వచ్చిన వారు 132 మంది ఉన్నారు. ఇప్పటికే 2403 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిపోగా, ప్రస్తుతం 1510 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

వలస, రిటర్నీలపై విడిగా..
కరోనా కేసులకు సంబంధించి ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేస్తోన్న బులిటెన్లలో లోకల్ కేసుల్ని, వలసదారులు, ఫారిన్ రిటర్నీల కేసుల్ని విడివిడిగా పేర్కొంటున్నారు. విదేశాల నుంచి వచ్చి కరోనా పాజిటివ్గా తేలిన వారు ఏపీలో 132 మంది ఉన్నారు. వాళ్లలో 114 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం మరో 12 మందిని డిశ్చార్జి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వాళ్లలో 907 మంది కరోనా పాజిటివ్గా ఉండగా.. వారిలో ప్రస్తుతం 553 యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం మొత్తం 36 మందిని డిశ్చార్జి చేశారు.

భారీగా టెస్టులు..
కొవిడ్-19 టెస్టుల నిర్వహణలో దేశంలోనే ముందు వరసులో కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్.. రోజుకో రికార్డు నెలకొల్పుతోన్న సంగతి తెలిసిందే. అయితే శని, ఆదివారాలతో పోల్చుకుంటే సోమవారం నిర్వహించిన టెస్టుల సంఖ్య కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,085 శాంపిల్స్ పరీక్షించినట్లు మంగళవారం నాటి హెల్త్ బులిటెన్ లో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటిదాకా చేసిన కరోనా టెస్టుల సంఖ్య 4.83లక్షలకు పెరిగింది.

కేబినెట్ భేటీ వేదిక మార్పు?
ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలోనే సచివాలయ ఉద్యోగులు సైతం వైరస్ కాటుకు గురవుతున్నారు. ఏకంగా 11 మంది ఉద్యోగులు పాజిటివ్ గా తేలడంతో.. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఈనెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 11వ తేదీన సచివాలయంలో కేబినెట్ సమావేశం కానున్నట్లు తొలుత ప్రకటించారు. అయితే సచివాలయంలోనే వైరస్ కేసులు బయటపడటంతో కేబినెట్ భేటీ వేదికను మార్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications