Coronavirus third wave: జగన్ సర్కార్ హైఅలర్ట్...అయిదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ..!
అమరావతి: దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత.. ఏ స్థాయిలో ఉందో చెప్పుకోనక్కర్లేదు. పెను సంక్షోభానికి దారి తీసిందిది. లక్షలమంది ప్రాణాలను బలి తీసుకుంది. అదే స్థాయిలో ఆసుపత్రుల పాలు చేసింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి రెండోదశలో సృష్టించిన ఉత్పాతం దుష్ప్రభావం- మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత్పైనే అధికం. ఒక దశలో దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివ్ కేసులు నాలుగు లక్షలను దాటేశాయి.. నాలుగు వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. సెకెండ్ వేవ్ తీవ్రత ఇప్పుడిప్పుడే భారీగా తగ్గుతోంది. రోజువారీ కేసులు లక్షకు పడిపోయాయి.
Recommended Video

థర్డ్వేవ్ వార్నింగ్..
ఈ పరిణామాల మధ్య ఇక కరోనా వైరస్ థర్డ్వేవ్ కూడా రాబోతోందనే సమాచారం.. ఉలిక్కి పడేలా చేస్తోంది. థర్డ్వేవ్ ఎఫెక్ట్ చిన్నపిల్లలపై అధికంగా ఉంటుందంటూ నిపుణులు హెచ్చరిస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ సూచిస్తోన్నారు. సెకెండ్ వేవ్లో ఏర్పడిన అవాంఛనీయ పరిణామాలు కరోనా వైరస్ మూడోదశలో తలెత్తకుండా ఉండటానికి ఇప్పటి నుంచే అప్రమత్తం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు.

పేర్ల నమోదు కోసం ఇంటింటి సర్వే..
దీన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్.. ముందస్తు చర్యలను తీసుకుంది. థర్డ్వేవ్ ప్రభావం ఉండకుండా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.. వాటిని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయనుంది. ఇందులో భాగంగా- రాష్ట్రంలో అయిదేళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులందరికీ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో దీన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అలాంటి తల్లులకు వీలైనంత త్వరగా రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చేలా జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. అయిదేళ్లలోపు పిల్లలున్న తల్లులు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయించనుంది.

ఆసుపత్రుల్లో పిల్లలతో పాటు తల్లులు కూడా..
అయిదేళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా ఉన్నట్లు జగన్ సర్కార్ గుర్తించింది. పిల్లలెవరైనా దురదృష్టవశావత్తూ కరోనా వైరస్ బారిన పడితే.. ఆ పిల్లలతో పాటు తల్లులు కూడా ఆసుపత్రిలో లేదా.. ఐసొలేషన్లో ఉండే వీలు కల్పించింది. ఈ చర్య వల్ల పిల్లలకు తల్లి ఒడిలో ఉన్నామనే భావన కలుగుతుందని, ఫలితంగా- వారు త్వరగా కోలుకోగలుగుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలా కరోనా వైరస్ బారిన పడిన తమ పిల్లల వెంట ఉండాల్సి వస్తుందనే కారణంతో- తల్లులకు త్వరగా రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

అన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా పీడియాట్రిక్ వార్డులు..
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా పీడియాట్రిక్ వార్డులు ఉండేలా చర్యలు తీసుకుంది. అలాగే- విశాఖపట్నంలో 500 బెడ్లతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రిని నిర్మించనుంది. దీనికి అవసరమైన డీపీఆర్ కూడా సిద్ధమైంది. విజయవాడ, తిరుపతిల్లో పీడీయాట్రిక్ ఆసుపత్రుల నిర్మించడానికీ చర్యలు చేపట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లోనూ పీడియాట్రీషీయన్లను నియమించడానికి సన్నాహాలు చేస్తోంది. కరోనా వైరస్ థర్డ్వేవ్లో పిల్లల ప్రాణాలను కాపాడటానికి అన్ని రకాల చర్యలను తీసుకుంటోన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications