కేంద్రం అన్యాయంపై 23 న వామపక్షాల నిరసన, 24 న వైసిపి ఎపి బంద్
అమరావతి:కేంద్ర ప్రభుత్వ విద్రోహపూరిత వైఖరిని నిరసిస్తూ...ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఈనెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సిపిఎం, సిపిఐ ప్రజలకు పిలుపునిచ్చాయి.
ఈ మేరకు ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు విషయంలో బిజెపి, ప్రధాని నరేంద్రమోడీ చేసిన ద్రోహం పార్లమెంటు సాక్షిగా బయటపడిందని వారు తెలిపారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంటులో అత్యధిక ప్రతిపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని కోరినప్పటికీ కేంద్రం మొండి వైఖరినే ప్రదర్శించిందని వారు పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ మాట తప్పి అబద్ధాలతో దేశ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారనన్నారు. సంఖ్యా బలం రీత్యా అవిశ్వాసం వీగిపోయినప్పటికీ ప్రజా క్షేత్రంలో బిజెపి ప్రభుత్వం మాత్రం విశ్వాసం కోల్పోయిందనే విషయం వాస్తవమన్నారు. హామీల అమల్లో వైఫల్యం చెందిన ఎన్డిఏ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామేనని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో తెలుగుదేశం తన బాధ్యత నుండి తప్పించుకోలేదని వారు స్పష్టం చేశారు.
పార్లమెంట్లో అవిశ్వాసం వీగిపోయినప్పటికి కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో తమ పోరాటం ఆగదని వారు తేల్చిచెప్పారు. ఈ నెల 23న సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదిలావుండగా ఎపికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బిజెపి చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా, తెలుగు దేశం పార్టీపై ఒత్తిడి పెంచేందుకు ఈనెల 24న ఎపి బంద్ పాటించాలని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కాకినాడలో జరిగిన బహిరంగ సభలో పిలుపునిచ్చారు. ఈ బంద్కు అన్ని పార్టీలు, సంఘాలు సహకరించాలని, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొనాలని జగన్ కోరారు.












Click it and Unblock the Notifications