ప్యాంటుతో రావాలి, లేదంటే పంచెలూడదీసి కొడతారు: వెంకయ్యపై నారాయణ
విజయవాడ: ఐదడుగుల కన్నయ్య కుమార్ను చూస్తే, ఆరడుగుల మోడీ వణికిపోతున్నారని సీపీఐ నారాయణ ఎద్దవా చేశారు. విజయవాడ నగరంలోని ఐవీ ప్యాలెస్ ప్రాంగణంలో నిర్వహించిన కన్నయ్య బహిరంగ సభకు సీపీఐ నేత నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో నారాయణ మాట్లాడారు.
ప్రధాని నరేంద్రమోడీకి ప్రజాస్వామ్య వాదులంటే వణుకు అని అన్నారు. ఇందులో భాగంగానే కన్నయ్య కుమార్ ఎక్కడికి వస్తే అక్కడ ఆందోళన చేయమని పార్టీ కార్యకర్తలకు చెబుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిని బావిలో కప్పగా అభివర్ణించారు.
ఇకపై వెంకయ్యనాయుడు మీటింగులకు వెళ్తే పంచెతో కాదు... ప్యాంటుతో హాజరుకావాలని అన్నారు. లేదంటే పంచెలూడదీసి కొడతారని ఆయన ఎద్దేవా చేశారు. నీతులు చెప్పడంలో ముందుండే వెంకయ్య ఈరోజు ఆ పార్టీ నేతలు చేసిన పనులకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
కన్నయ్య కుమార్ని అడ్డుకోవడం లాంటి ఘటనల ద్వారా ప్రజలకు ఎవరు ప్రజాస్వామ్య పరిరక్షకులు? ఎవరు ప్రజాస్వామ్యానికి ముప్పు? అన్న విషయాలు అర్థమవుతున్నాయని అన్నారు. తప్పుడు ఆరోపణలతో కన్నయ్య కుమార్కు వ్యతిరేకంగా బీజేపీ అర్థం లేని ఆందోళనలు చేస్తోందని అన్నారు.
ఈ సభకు వామపక్ష విద్యార్ధి సంఘాలు భారీ ఎత్తున హాజరయ్యారు. మరోవైపు కన్నయ్య కుమార్ గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నప్పుడు నుంచి అడుగడుగునా ఆతడిని అడ్డుకునేందుకు ఏబీవీపీ, బీజేపీ నేతలు యత్నించారు. సభ జరిగిన ఐవీ ప్యాలస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కన్నయ్య కుమార్ సభను అడ్డుకొనేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు యత్నించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బహిరంగ సభ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సభకు హాజరైన కన్నయ్యకుమార్కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో వారిపై ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు దాడిచేశారు.
ఈ దాడిలో గాయపడిన ఓ బీజేపీ కార్యకర్తను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లాఠీ చార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో కన్నయ్య కుమార్ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యం చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.