సీఎం జగన్ సీక్రెట్ అఫైర్.. బీజేపీతో లీగల్గా సంసారం చేసుకోండన్న సీపీఐ నేతలు.. నరికివేత హెచ్చరిక
సాధారణ రాజకీయ పార్టీల కార్యకర్తల నుంచి కేబినెట్ మంత్రుల నోటి వెంట ఫిల్తీ లాంగ్వేజ్ పొర్లుకొస్తున్న ప్రస్తుత సందర్భంలో.. సిద్ధాంతాల ప్రాతిపదికన ఏర్పడ్డ కమ్యూనిస్టు పార్టీలు కూడా అదే బాటను అనుసరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాజధాని తరలింపు అంశంలో సీఎం జగన్ తీరును తప్పుపతూ విమర్శలు చేస్తోన్న ఏపీ సీపీఐ నేతలు.. రెండ్రోజులుగా స్వరం పెంచడం, అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

మోదీ, షాకు అన్నీ తెలుసు
ఏపీలో రాజధాని ఎక్కడుండాలో సీఎం జగన్ డిసైడ్ చేసుకుంటారని, వైసీపీ ప్రభుత్వం ఏ తీర్మానాన్ని పంపినా దాన్ని కేంద్రం యధావిధిగా ఆమోదిస్తుందన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తప్పుపట్టారు. కొన్నిగంటల కిందట విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నఆయన.. బీజేపీతో సీఎం జగన్ సీక్రెట్ అఫైర్ సాగిస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఏపీలో జరుగుతోన్న వ్యవహారాలన్నీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనుసన్నల్లో సాగుతున్నవేనని చెప్పారు.

ఇక ముసుగు తీసేయండి..
‘‘ఏపీలో వైసీపీ, బీజేపీలు రహస్యంగా కలిసుంటూ.. పైకి మాత్రం నాటకాలాడుతున్నాయి. పైన మోడీ, అమిత్ షాకు తెలియకుండా జగన్ ఏదీ చేయడు. రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చని మాట్లాడుతోన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ ముమ్మాటికీ జగన్ ఏజెంటే. జనానికి అంతా తెలిసిపోయిన తర్వాతైనా ఆ రెండు పార్టీలూ లీగల్ గా కాపురం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. అసెంబ్లీ, సచివాలయం ఒకే చోట ఉండాలని మా పార్టీ మొదటి నుంచీ చెబుతోంది''అని నారాయణ అన్నారు. అంతకంటే ముందు..

సీఎంను నరికేస్తారు..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా సీఎం జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతానికి వచ్చే దమ్ము ముఖ్యమంత్రికి లేదని.. ఆయనగానీ తుళ్లూరులో కనిపిస్తే మహిళలు ముక్కలు ముక్కలుగా నరికేస్తారని రామకృష్ణ అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణను గాడిదతో పోల్చుతూ.. ఉద్యమానికి భయపడి, జనం గుర్తుపట్టకుండా ఉండటానికే బొత్స గుండు చేయించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. అమరావతి లాంటి ఉద్యమమే రాయలసీమలో జరిగి ఉంటే ఎక్కడిక్కడ అన్నీ ధ్వంసం చేసేవాళ్లమంటూ రైతులను రెచ్చగొట్టారాయన.

తల్లి.. చెల్లి.. ఆలి..
రాజధాని తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సీపీఐ నేతలు.. సీఎం జగన్ వ్యక్తిగత విషయాలపైనా విమర్శలు చేస్తుండటం గమనార్హం. రాజధాని తరలింపు వద్దని వైఎస్ విజయమ్మ చెప్పినా జగన్ వినిపించుకోవడంలేదని, చెల్లి, భార్యల మాటల్ని కూడా సీఎం పెడచెవినపెడుతున్నారని సీపీఐ రామకృష్ణ మీడియాతో అన్నారు. టీడీపీ, జనసేన పార్టీల నేతల కంటే దారుణంగా సీపీఐ నేతలు అనుచిత భాష వాడుతున్నారని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications