పీఆర్సీ పోరుపై ఉద్యోగులకు సీపీఐ నారాయణ చురకలు-తెగేదాకా లాగొద్దని జగన్ కూ సూచన
ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులకు సీపీఐ నారాయణ కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నేతలు తాజాగా చేస్తున్న వ్యాఖ్యలపైనా నారాయణ స్పందించారు. అలాగే వైసీపీ ప్రభుత్వానికీ ఈ సమస్య పరిష్కారంపై ఓ సూచన చేశారు.
పీఆర్సీ పోరులో భాగంగా రాజకీయ పార్టీలతో తాము అంటకాగడం లేదంటూ తాజాగా ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల సమావేశాల్లో చెప్పడంపై సీపీఐ నారాయణ స్పందించారు. రాజకీయ పార్టీలకు ఉద్యోగులు అంటకాగాల్సిన అవసరం లేదని,అలాగే వారిని అంటరానివారిగా పరిగణించాల్సిన అవసరం కూడా లేదని నారాయణ తెలిపారు.
రాజకీయాలతో మాకు సంబంధం లేదని ఉద్యోగులు చెప్తున్నారని, ఏ రాజకీయ పార్టీ ఉద్యోగ సంఘాల్ని ఉపయోగించుకుంటోందో వారు గుర్తించాలని నారాయణ కోరారు. ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రాన రాజకీయ పార్టీల్ని అంటరానివిగా చూడటం సరికాదని ఉద్యోగసంఘాలకు ఆయన సూచించారు.
పీఆర్సీ పోరుపై ఉద్యోగులకు సీపీఐ నారాయణ చురకలు pic.twitter.com/wzVPypdHpg
— oneindiatelugu (@oneindiatelugu) January 22, 2022
పీఆర్సీ వ్యవహారంలో ఎట్టకేలకు ప్రభుత్వంపై భ్రమలు తొలిగి ఐక్యపోరుకు ఉద్యోగులు సిద్ధం కావడం అభినందనీయమని సీపీఐ నారాయణ తెలిపారు ప్రభుత్వం దిగివచ్చి భేషజాలకు పోకుండా ఉద్యోగుల డిమాండ్లకు అంగీకరించాలని సీపీఐ నారాయణ సూచించారు. తెగేదాకా లాగకుండా వాస్తవ పరిస్దితుల ఆధారంగా విర్ణయం తీసుకోవాలని సూచించారు.
తద్వారా సమస్యకు ముగింపు పలకాలని నారాయణ సలహా ఇచ్చారు. ఉద్యోగుల పోరులో సీపీఐ అనుబంధ ఉద్యోగ సంఘాలు కీలకంగా మారిన నేపథ్యంలో మిగతా ఉద్యోగ సంఘాల వ్యాఖ్యలపై నారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. అయితే ప్రభుత్వానికి ఆయన చేసిన సూచనపై ఎలా స్పందిస్తుందో కూడా చూడాల్సి ఉంది.