ఇద్దరూ ఇద్దరే: 'బాబు కొంటే.. జగన్ బెదిరింపు, వైసిపిలో అమ్ముడు సరుకు'
విశాఖ: అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల పైన సిపిఐ నేత రామకృష్ణ మంగళవారం నాడు నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసిపిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అమ్ముడుపోయేవారేనని ఆరోపించారు.
ఆ పార్టీలోని వారు అందరూ అమ్ముడుపోయే సరుకే అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.5 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుంటే, జగన్ అయితే బెదిరించి లాక్కుంటారని విమర్శించారు. ఇద్దరూ నేతలలో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాదన్నారు. ఇద్దరూ ఇద్దరే అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలోను ప్రతిపక్షం లేకుండా చేయాలని చంద్రబాబు, తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తాజా రాజకీయాల పైన వామపక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. విశాఖకు రైల్వే జోన్ తీసుకు రాకుంటే ఎంపీ హరిబాబు రాజీనామా చేయాలన్నారు.
ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను కూల్చుతున్న కేంద్రాన్ని వైసిపి ఆశ్రయించడం గొర్రెలు తినే వారికి మొరపెట్టుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ చేస్తున్న ఫిరాయింపుల పైన జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
టిడిపిలోకి గొట్టిపాటి ముహూర్తం ఖరారు
వైసీపీ నేత, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ తెలుగుదేశం పార్టీలోకి చేరే ముహూర్తం ఖరారు అయింది. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ ఎక్కనున్నారు. రెండు రోజుల క్రితం తన మద్దతుదారులు, అనుచరులతో సంతమాగులూరులో సుదీర్ఘ మంతనాలు జరిపారు. గొట్టిపాటి టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ముహూర్తం రేపు మధ్యాహ్నం ఖరారు అయింది.