జగన్ను చంద్రబాబు పరామర్శించకపోవడం తప్పే...స్వతంత్ర సంస్థ దర్యాప్తు:సిపిఐ రామకృష్ణ
కర్నూలు:విశాఖ ఎయిర్పోర్టులో ప్రతిపక్ష నేత జగన్పై కత్తి దాడి జరిగితే ఆయనను సీఎం చంద్రబాబు పరామర్శించకపోవడం తప్పేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
జగన్పై దాడి కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని, తుఫాన్తో ఉత్తరాంధ్ర నష్టపోయిందని చెప్పారు. తితలీ తుఫాన్ ప్రభావంపై కేంద్రం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశంలోనే లేనట్లు ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు.

వచ్చేనెల 3న విజయవాడలో వామపక్ష పార్టీల సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చర్చిస్తామని రామకృష్ణ వెల్లడించారు. అంతకుముందు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎపిలోని టిడిపి ప్రభుత్వంపై సిపిఐ రామకృష్ణ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం నియంత పాలనకు ప్రతిపక్ష నాయకుల ముందస్తు అరెస్టులే నిదర్శనమని రామకృష్ణ ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కడప పర్యటన సందర్భంగా సిపిఎం, సిపిఐ, జనసేన, వైసిపి నాయకులను ముందస్తు అరెస్టులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కడప జిల్లా సిపిఐ కార్యాలయాన్ని పోలీసు బలగాలు ముట్టడించి జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్యను అత్యంత పాశవికంగా అరెస్టు చేయడం దారుణమని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ విషయమై సిఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన వారిపై పోలీసులను ప్రయోగించి నిర్బంధాలు, అరెస్టులు చేస్తారా అని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ప్రజాతంత్రవాదులంతా ప్రభుత్వ దుందుడుకు చర్యలను ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications