2018 కంటే వరస్ట్ ఫ్లడ్ హిట్- ఆలువ శివాలయం నీట మునిగిందంటే..!!
ఎడతెరిపి లేకుండా వర్షాలకు కేరళ అల్లాడుతోంది. భారీ వర్షాలు ఉధృత రూపం దాల్చాయి. అంతకంతకూ వాటి తీవ్రత పెరుగుతూ పోతోంది. నదులు, ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అనేక జిల్లాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు ఎనిమిది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
చారిత్రాత్మక ఆలువ శివాలయం సైతం నీట మునిగిందంటే వర్షాలు, వరదల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2018 నాటి కంటే ఇప్పుడు సంభవిస్తోన్న వరదల మరింత బీభత్సాన్ని సృష్టిస్తోన్నాయి. ఈ ఆకస్మిక వరదల వల్ల ప్రజల సాధారణ జీవనం పూర్తిగా స్తంభించిపోవడంతో వీడీ సతీషన్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పెరియార్ నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో భూతత్థాన్ కెట్టు ఆనకట్టకు సంబంధించిన 14 గేట్లను ఎత్తివేశారు. మరమ్మతుకు గురైన ఒక్క గేటును మాత్రం మూసి ఉంచారు. పెరియార్ నది నీటిమట్టం దాదాపు మూడు అడుగుల మేర పెరగడంతో ప్రసిద్ధ ఆలవా మనప్పురంలోని శివలింగం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. మూవట్టుపుజ, తోడుపుజ, కొథయార్ తదితర నదులు కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
కొథమంగళం ప్రాంతంలో మణికంఠన్చాల్ కాజ్వే, కుడముండ బ్రిడ్జి, మణిక్కినార్ వంతెనలు పూర్తిగా నీట మునిగాయి. దీనివల్ల రవాణా నిలిచిపోయింది. కొచ్చి-ధనుష్కోడి జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆదిమాళి, ఇడుక్కి ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడటంతో హైరేంజ్ ప్రాంతాలకు కనెక్టివిటీ దెబ్బతింది. బ్లవానా- కళ్లిమేడు రోడ్ మొత్తం ధ్వంసమైంది. పలు గిరిజన ప్రాంతాలు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
కొండ ప్రాంతాలనే కాకుండా తీరప్రాంతాలను కూడా వర్షాలు వణికిస్తోన్నాయి. చేళ్లనమ్ పంచాయతీ పరిధిలోని కన్నమాళి తీరంలో సముద్ర కోతకు గురైంది. అలలు ముంచెత్తడంతో వందకు పైగా ఇళ్లలోకి నీరు చేరింది. మూవట్టుపుజ ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలోకి వరద నీరు చేరడంతో రోగులను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈదురు గాలుల కారణంగా వేంగూర్ పరిధిలోని పణియేళిలో చెట్లు విరిగిపడి అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.
వరద ఉధృతి నేపథ్యంలో ఎర్నాకులం జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది. మూవట్టుపుళలో నాలుగు, కొథమంగళంలో రెండు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి మొత్తం 84 మంది బాధితులను అక్కడికి చేర్చారు. మూవట్టుపుళ, తోడుపుళ నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో వీటి పరీవాహక ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తాజా పరిస్థితులపై రెవెన్యూ మంత్రి ఏపీ అనిల్కుమార్ స్పందించారు. నిరాశ్రయులను సహాయక, పునరావాస శిబిరాలకు తరలిస్తోన్నట్లు తెలిపారు. దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించి రాకపోకలను సాధ్యమైనంత వరకు పునరుద్ధరిస్తున్నామని వివరించారు. పలు జిల్లాల్లో 320 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైందని, కన్నూర్, ఎర్నాకుళం, పథథనంతిట్ట, ఇడుక్కి, వయనాడ్, కొట్టాయం, కోజికోడ్ జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉన్నట్లు చెప్పారు.













Click it and Unblock the Notifications