నారాయణకు సిపిఎం షాక్: వైకాపా ఖాతాలో ఖమ్మం
ఖమ్మం లోకసభ స్థానంలో వామపక్షాలు కలిసి పనిచేసి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేది. సిపిఎం మద్దతు తెలిపి ఉంటే నారాయణ విజయం సాధించి ఉండేవారు. అయితే, సిపిఎం వైయస్సార్ కాంగ్రెసుకు మద్దతు ప్రకటించింది. ఖమ్మం లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శ్రీనివాస రెడ్డి విజయం వెనక సిపిఎం మద్దతు ఉందనేది స్పష్టం.
ఖమ్మం జిల్లాలో వామపక్షాలకు గణనీయమైన బలం ఉంది. వామపక్షాలు చీలిపోవడం ఈసారి ఖమ్మం జిల్లా ప్రత్యేకత. సిపిఐ తెలంగాణలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోగా, సిపిఎం తెరాసకు మద్దతు ఇవ్వాలని తన పార్టీ శ్రేణులకు సూచించింది. ఇది ఖమ్మం లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కలిసి రాగా, తెలంగాణలో తెరాసకు కూడా కలిసి వచ్చి ఉంటుంది.
సమైక్యాంధ్ర నినాదం పుచ్చుకున్న తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. పైగా, తెరాస ప్రాబల్యం ఖమ్మం జిల్లాలో ఏ మాత్రం లేదు. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం శాసనసభా స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అది కూడా జలగం వెంకటరావు బలమైన అభ్యర్థి కావడం వల్ల విజయం సాధ్యమైంది.