చంద్రబాబుకు సున్నబొట్లు తప్పవ్: మధు, అక్కడే ఉంటా: దేవినేని
విజయనగరం/రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సున్నంబొట్లు తప్పవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గురువారం మండిపడ్డారు. విజయనగరం జిల్లా భోగాపురం కౌలువాడలో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట సంఘం ఆందోళన నిర్వహించింది.
ఈ పోరాటానికి మధు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందని ఆరోపించారు. కేసులకు భయపడితే భూములు వదులుకోవాల్సి ఉంటుందని రైతులను హెచ్చరించారు. రైతుల భూముల జోలికి వస్తే చంద్రబాబుకు సున్నంబొట్లు తప్పవన్నారు.
అక్కడే ఉంటా: దేవినేని
ఆగస్టు 15వ తేదీన పట్టిసీమ నుంచి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేస్తారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. దీనిపై సిఎం ప్రకటన చేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలిస్తారని చెప్పారు.
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల పైన తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేసే ఉద్దేశ్యంలో భాగంగా తాను అక్టోబర్ 22వ తేదీ నుంచి అక్కడే ఉంటానని దేవినేని చెప్పారు.
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. పట్టిసీమను ఎంత వేగంగా పూర్తి చేస్తున్నామో పోలవరంను అంతే త్వరగా పూర్తి చేస్తామన్నారు. వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవగాహనారాహిత్యంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు.
కాగా, కోస్తాలో వర్షాల కారణంగా పట్టిసీమ, పోలవరం కుడి కాలువ పనులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమను పరిశీలించి, పంద్రాగస్టు నాడు జాతికి అంకితం చేస్తారు.