రైతులంతా మరణించిన తర్వాత అమరావతిని...
రాజధానికి భూములిచ్చిన రైతులంతా మరణించిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఏలుకోవాలని ఆశ పడుతున్నారని అమరావతి పరిరక్షణ సమితి నాయకుడు బెజవాడ రమేష్ విమర్శించారు. అమరావతి పరిధిలో కొత్తగా ఆర్-5 జోన్ ఏర్పాటు, పేదలందరికీ ఇళ్ల పథకం కింద స్థలాల కేటాయింపుపై రైతుల అభ్యంతరాలను సీఆర్డీఏ అధికారులు స్వీకరించారు.
రూపాయి భూమిని మూడురూపాయలకు కొన్నారు
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో రమేష్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించేందుకు రూపాయి విలువ చేసే భూమిని మూడురూపాయలకు కొన్నారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన లౌఔట్ లో గజం రూ.17వేలుగా నిర్ణయించారన్నారు. దానికి మూడురెట్లు రూ.51వేల చొప్పున కొనుగోలుచేసి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
కలెక్టర్, అధికారులు ఇళ్లకే వచ్చారు
జిల్లా కలెక్టర్, సీఆర్డీయే కమిషనర్ తమ ఇళ్లకు వచ్చారని, మ్యాపులు చూపించి ప్రత్యేక వసతలు కల్పిస్తామని చెబితేనే తాము భూములిచ్చామన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని అప్పుడే చెప్పితే ఇచ్చేవాళ్లం కాదు కదా అన్నారు. తమ గ్రామాల్లో పెట్టాల్సిన ప్రజాభిప్రాయ సేకరణను విజయవాడలో ఏర్పాటు చేసినా ఇక్కడకు వచ్చామన్నారు. విచారణకు వచ్చిన వారిని దొంగల్లా, నేరస్థుల్లా చూస్తున్నారని జేఏసీ నాయకుడు గద్దే తిరుపతిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోవడంవల్ల ముళ్ల చెట్లు పెరిగాయని, పాములు తిరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుకు గాయాలు
సీఆర్ డీయే ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన రైతు రామినేని అప్పారావు గాయపడ్డారు. భోజన సమయంలో కళాక్షేత్రం వెనకవైపు నుంచి ఆయన ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సమావేశ ప్రాంగణం గేటు ఎదురుగా ఆగివున్న సీఆర్ డీయే కారు నుంచి దిగేందుకు డ్రైవర్ డోర్ తీయగా అప్పారావు పడ్డారు. ఆయన చేతివేళ్లకు గాయాలవడంతో సీఆర్డీయే వాహనంలో చికిత్స కోసం ఆసుపత్రికి పంపించారు.