ఏపీలో రైతులకు ముందే సంక్రాంతి- రైతు భరోసా, నివర్ సాయం విడుదల చేసిన జగన్
ఏపీలో నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత మొత్తాన్ని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. దీంతో పాటు గత నెలలో వచ్చిన నివర్ తుపాను ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని కూడా విడుదల చేసింది. సీఎం జగన్ ఇవాళ క్యాంపు కార్యాలయంలో స్విచ్ ఆన్ చేసి ఈ మొత్తాలను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు.
నవరత్నాల్లో భాగంగా వైసీపీ సర్కారు ప్రతీ ఏటా రైతులకు పెట్టుబడి సహాయంగా ఇస్తున్న రూ.13,500ను వరసగా రెండో ఏడాది కూడా ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోంది. ఇందులో తొలి విడతగా ఖరీఫ్ సీజన్ ఆరంభంలో మే 15వ తేదీన పెట్టుబడి సహాయం చేయగా, రెండో విడత సహాయాన్ని అక్టోబరు 27న అందజేశారు. ఇక చివరి విడత సహాయాన్ని రూ.2 వేల చొప్పున ఇప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
దీంతో రాష్ట్రంలో 51.59 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో మొత్తం రూ.1,120 కోట్లు జమ చేస్తున్నారు.
అలాగే ఈ సొమ్మును బ్యాంకులు బాకీల కింద జమ చేసుకోకుండా, రైతుల అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాల్లో జమ చేస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో తొలిసారిగా ఒక సీజన్ ఇన్పుట్ సబ్సిడీని అదే సీజన్లో ఇస్తున్నారు. నవంబరు నెలాఖరులో వచ్చిన నివర్ తుపాను వల్ల 12.01 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. ఆ మేరకు పంటలు నష్టపోయిన 8.34 లక్షల రైతులకు రూ.645.99 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) ఇప్పుడు అందజేస్తున్నారు.
అదే విధంగా రైతులకు ఏ సమస్య వచ్చినా సంప్రదించేందుకు 155251హెల్ప్లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications