ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- పీఆర్సీపై కసరత్తు పూర్తి : రేపు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం..!!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న పీఆర్సీ పైన ఒకటి రెండు రోజుల్లోనే కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పీఆర్సీతో పాటుగా ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనల బాట పట్టారు. అక్టోబర్ మాసాంతానికే పీఆర్సీ పైన నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం నుంచి హామీ వచ్చినా..అది అమలు కాలేదు. ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే మూడు సార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసారు. అయితే, తమకు పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరినా..ఇప్పటి వరకు అందలేదు.

పీఆర్సీ పై తుది కసరత్తు
ఇదే సమయంలో తిరుపతిలో వరద బాధితులను పరామర్శిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ వారం - పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన ఉంటుందని హామీ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం సీఎం జగన్ ఏపీలో ఆర్దిక పరిస్థితి పైన సమీక్ష నిర్వహించారు. ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ ఫిట్ మెంట్ ఏ మేర ఇవ్వాలి..ఎంత మేర ప్రభావం పడుతుందనే అంశం పైన చర్చించారు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు పెంచిన వేతనాల కారణంగా అదనంగా రూ 18 వేల కోట్ల భారం పడినట్లు అధికారులు వివరించారు.

సీఎంకు సీఎస్ అధ్యయన నివేదిక
ఇక, ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారి సచివాలయానికి వచ్చిన సందర్బంగా ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తున్నారు. ఇక, ఉద్యోగులకు చెల్లించాల్సిన మూడు డీఏల పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో..ఎంత మేర ఫిట్ మెంట్ ఖరారు చేస్తే ప్రభుత్వం పైన ఏ మేర భారం ఉంటుందనే దాని పైన చర్చించి..నివేదిక ఇవ్వాలని సీఎస్ కు సీఎం జగన్ సూచించారు. దీంతో...ఒక్కో శాతం ఫిట్ మెంట్ పెంచితే ప్రభుత్వంపైన రూ 400 కోట్ల మేర భారం పడుతుందనే అంచనాకు వచ్చారు.

ఉద్యోగ సంఘాలకు రిపోర్టు
సీఎస్ నేతృత్వంలోని హైలెవల్ కమిటీ ఇప్పటికే పీఆర్సీ నివేదికలోని అంశాలు..ప్రభుత్వానికి సూచనల పైన అమలుకు వీలుగా ఒక నివేదిక సిద్దం చేసినట్లుగా సమాచారం. ఈ నివేదికను ఈ సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శమీర్ శర్మ ముఖ్యమంత్రి జగన్ కు అందచేయనున్నారు. అదే విధంగా మంగళవారం ఉద్యోగ సంఘాలను ఆహ్వానించి వారికి సైతం నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నుంచి ఫిట్ మెంట్ పైన అంచనాలు - అభిప్రాయాలు సేకరించనున్నారు. ప్రభుత్వం ఎంత మేర పెంపుకు సిద్దంగా ఉందనే విషయాలను వివరిస్తారు.

సీఎం జగన్ తుది నిర్ణయం.. ఉద్యోగుల నిరీక్షణ
ఆ తరువాత సీఎం జగన్ వద్ద ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నాయి. ముఖ్యమంత్రి వద్ద జరిగే తుది చర్చల్లో అధికారికంగా పీఆర్సీ పైన నిర్ణయం వెలువడనుంది. రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని సైతం పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీంతో.. 32 నుంచి 35 శాతం వరకు సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. ఇక, ఏపీలో ప్రస్తుతం ఆర్దికంగా సమస్యలు ఉండటంతో..పీఆర్సీ ప్రయోజనాలు ఇప్పటి వరకు అందాల్సినవి ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని..వచ్చే ఆర్దిక సంవత్సం, ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు ఉద్యోగులకు ఇచ్చే విధంగా ప్రతిపాదన సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సాయంత్రం నివేదిక బయటకు వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ తీసుకొనే తుది నిర్ణయం పైనే ఇప్పుడు ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications