కానిస్టేబుల్ కుటుంబానికి ఆనంద్ చెక్ ప్రదానం
హైదరాబాద్: ఎల్లంగౌడ్ నేతృత్వంలోని నకిలీ కరెన్సీ దొంగల ముఠా కేసులో మరణించిన కానిస్టేబుల్ ఈశ్వర్ రావు కుటుంబానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ నష్టపరిహారం కింద 5 లక్షల 24 వేల 400 రూపాయల చెక్ను అందించారు. గత నెల శామీర్పేట పరిధిలో నకిలీ కరెన్సీ ముఠా దాడిలో కానిస్టేబుల్ ఈశ్వర్ రావు మరణించిన విషయం తెలిసిందే.
ఈశ్వర రావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని సర్బుజిలి మండలం సలంతరి గ్రామం. శనివారంనాడు ఈశ్వర్ రావు తల్లిదండ్రులు మల్లేశ్వర్ రావు, తవిటమ్మ, అన్న రమణమూర్తి వచ్చి సివి ఆనంద్ను కలిశారు. సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సంక్షేమ నిధి నుంచి రూ.5 లక్షలు, సహకార సంఘం నుంచి 19,400 రూపాయలు, ఫ్లాగ్ ఫండ్ నుంచి 5000 రూపాయలు ప్రదానం చేశారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం రూ.25 లక్షలు త్వరలో ఇప్పిస్తామని ఆనంద్ ఈశ్వర్ రావు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈశ్వర్ రావు కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి కోరుకున్న చోట ఉద్యోగం ఇప్పిస్తామని ఆయన చెప్పారు.
మిగతా భద్రత, ఎలిజిఎల్ఐ, పాలసీ సంబంధించిన బెనిఫిట్స్ను త్వరగా ఇప్పించాలని ఆయన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు సిహెచ్ భద్రారెడ్డి, సభ్యులు జి. కృష్ణారెడ్డి, పి. మనోహర్ పాల్గొన్నారు.