టిడబ్ల్యుసి తీర్మానమే అమలు: తెలంగాణపై మొయిలీ
న్యూఢిల్లీ: తెలంగాణపై సిడబ్ల్యుసి చేసిన తీర్మానాన్నే కేంద్రం అమలు చేస్తుందని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తమకు చెప్పినట్లు తెలంగాణ కాంగ్రెసు నేతలు చెప్పారు. వారు సోమవారం మొయిలీతో సమావేశమయ్యారు. సిడబ్ల్యుసి నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని మొయిలీ చెప్పినట్లు తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత షబ్బీర్ అలీ చెప్పారు. మొయిలీతో సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగంవంతం చేయాలని తాము మొయిలీని కోరినట్లు తెలిపారు. సిడబ్ల్యుసి నిర్ణయాన్నే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అమలు చేస్తామని సీమాంధ్ర నేతలకు కూడా తాము చెప్పామని మొయిలీ తమతో అన్నట్లు షబ్బీర్ అలీ చెప్పారు. సంయమనంతో వ్యవహరించాలని మొయిలీ సూచించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరడానికి తాము కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దలను కలుస్తామని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, సీమాంధ్ర కాంగ్రెసు నేతలు సోమవారం సాయంత్రం ఎపి భవన్లో సమావేశమయ్యారు. తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి వారు సమావేశమయ్యారు. రేపు ఏడుగురు లోకసభ సభ్యులకు రాజీనామాల వ్యవహారంపై స్పీకర్ మీరా కుమార్ సమయం ఇచ్చారు. తాము రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇది వరకే చెప్పారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఆయన ఢిల్లీలో కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో కలిసే అవకాశం ఉంది. మరోసారి సమైక్యాంధ్ర అవసరాన్ని ఆయన అధిష్టానం పెద్దలకు వివరించే అవకాశం ఉంది.