ఏపీలో ఆరు జిల్లాల్లో - కోటి మందికి అలర్ట్ హెచ్చరిక: తుఫాను దూసుకొస్తోంది..!!
మాండూస్ తుఫాను బలంగా దూసుకొస్తోంది. ఏపీలోని ఆరు జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. తుఫాను పైన తాజాగా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతానికి కారైకాల్కు తూర్పు ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, చెన్నై 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తుపాను నేపధ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాల్లోని కోటిమందికి పైగా సబ్ స్ర్కైబర్లకి అమరావతి ఐఎండీ హెచ్చరిక సందేశాలు పంపింది.
ఏపీలో ఆరు జిల్లాలపై ప్రభావం
తుఫాను గమనంను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కంట్రోల్ రూం అధికారులు ఏపీ అధికార యంత్రాంగానికి సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తుఫానుకు సంబంధించి కంట్రోల్ రూం ఏర్పాటు చేసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభావిత ఆరు జిల్లాల అధికారులతో సమీక్ష చేసారు. తుఫాను తీరం దాటే సమయంలో ఆరు జిల్లాల్లో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
శుక్రవారం అర్థరాత్రి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని పర్భావంతో మూడు రోజులపాటు.. దక్షిణ కోస్తాంధ్రాలోని ప్రకాశరం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
భారీ వర్షాలకు ఛాన్స్ - ముందస్తు హెచ్చరికలు
అలాగే, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెప్పుకొచ్చారు.
ఏపీతో పాటుగా తమిళనాడులోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కాగా, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమిళనాడులోని ప్రభావిత జిల్లాలకు ముందస్తుగానే చేరుకున్నాయి. తిరువారూర్, నాగపట్నంలో విద్యాసంస్థలు బంద్ ప్రకటించారు. పుదుచ్చేరి, కరైక్కాల్లో తీరం కోతకు గురైంది.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ఏపీ ప్రభుత్వం తుఫాను పైన నిరంతరం సమీక్షిస్తోంది. రేపు (శుక్రవారం) తుఫాను ప్రభావం ఆరు జిల్లాల మీద ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో, భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా.. సహాయక చర్యల కోసం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను నియమించారు.
శనివారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తుగా లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారుకు ఆదేశాలు అందాయి.