Cyclone Michaung: నెల్లూరు మునక: 219 మిల్లీ మీటర్ల వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ మహోగ్రంగా మారింది. అతి పెను తుఫాన్గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుఫాన్- నెల్లూరు తీరానికి అతి సమీపానికి చేరింది. ఈ తెల్లవారుజామున 2:30 గంటల సమయానికి నెల్లూరుకు ఈశాన్య దిశగా బంగాళాఖాతంలో 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కావలికి 50, చెన్నైకి 170, బాపట్లకు 150, మచిలీపట్నానికి 210 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ సాయంత్రానికి బాపట్ల- మచిలీపట్నం మధ్య, బాపట్లకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని వేగం కొద్దిగా మందగించింది. ఇదివరకు గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదలగా.. ఇప్పుడు 10 కిలోమీటర్లకు పరిమితమైనట్లు ఐఎండీ పేర్కొంది.
తీరానికి సమాంతరంగా కదులుతుండటం వల్ల నెల్లూరు నుంచి మచిలీపట్నం వరకు అతి తీవ్రమైన, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, బాపట్ల, అన్నమయ్య రాయచోటి, జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.

నెల్లూరులో అత్యధికంగా 219 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బాపట్ల- 215, మచిలీపట్నం- 151.7, కావలి- 143.6, ఒంగోలు- 117, కాకినాడ- 77.6, నరసాపురం- 60.6, పొదలకూరు- 212, రేపల్లె- 117.5, చినగంజాం- 72.5 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.
ఊటుకూరు- 66, దర్శి- 64.5, లామ్- 57, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్- 53, కైలాసగిరి- 35.5, అనకాపల్లి- 34, కాలవచర్ల- 34, వెంకటరామన్న గూడెం- 33.5, విజయరై- 21.5, ఆరోగ్యవరం- 20.5, పందిరిమామిడి- 16.5, గరికపాడు- 13.5, చిత్తూరు- 13, నరసరావుపేట- 12, గొట్టా బ్యారేజీ- 10.5, పాలకొండ- 7.5 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications