Montha Cyclone: సచివాలయాలపై చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ఏపీ తీరంవైపు మొంథా తుపాను దూసుకొస్తోంది. ఈ అర్థరాత్రికి తుపాను తూర్పు తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భారీ అప్రమత్తత ప్రకటించింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఇప్పటికే వాహనాల రాకపోకల్ని నిలిపేస్తున్నారు. అదే సమయంలో అమరావతి సచివాలయంలోనే ఉండి తుపాను చర్యల్ని సమీక్షిస్తున్న చంద్రబాబు కొద్దిసేపటి క్రితం కీలక ఆదేశాలు ఇచ్చారు.
సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ నుంచి మొంథా తుఫానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, ఆర్టీజీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైందని అధికారులు సీఎంకు తెలిపారు. గత నాలుగు గంటల్లో విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదైందన్నారు.

ప్రస్తుతం కాకినాడకు 150 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం అయిందని తెలిపారు. అర్థరాత్రి 11.30 నాటికి తుఫాన్ తీరం దాటవచ్చని అంచనా వేశారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి రేపు తెల్లవారుజాము వరకూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి 9 గంటల నుంచి రహదారులపై రాకపోకలు నిలిపివేస్తున్నారు. రాకపోకల నిలిపివేతతో ఆగిపోయిన వాహనదారులకు ఆహారం, తాగునీటి సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు.

అలాగే వివిధ మండలాల్లో అందుబాటులో ఉంచిన 321 కిసాన్ డ్రోన్లతో వ్యాధిగ్రస్తులకు మెడిసిన్స్ పంపిణీ చేయాలని సీఎం సూచించారు. దీంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే క్షేత్ర స్థాయి సిబ్బంది గ్రామ,వార్డు సచివాలయాలు బేస్ క్యాంప్గా పని చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. సహయక చర్యల కోసం వాహనాలు, జేసీబీలు, క్రేన్లు, ప్రొక్లయినర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రతి వాహనాన్ని, జేసీబీలను ఆర్టీజీఎస్ నుంచి అధికారులు లైవ్ ట్రాకింగ్ చేస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని గర్భిణుల క్షేమ సమాచారంపై ముఖ్యమంత్రి ఆరా తీయడంతో పాటు వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని నిర్దేశించారు.












Click it and Unblock the Notifications