బెజవాడలో దామోదర టీ, అడ్డుకుంటాం: లగడపాటి
విజయవాడ/ రాజమండ్రి: సీమాంధ్రలోని విజయవాడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలంగాణవాదం వినిపించారు. విజయవాడ రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్ిన తెలుగుదేశం పార్టీ నేత సత్యప్రసాద్ను ఆయన శనివారంనాడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
ఒకే ప్రాంతానికి న్యాయం చేయాలంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు. రాష్ట్రం ఇంకా కలిసి ఉంటుందని సీమాంధ్ర ప్రజలను మోసం చేయవద్దని ఆయన అన్నారు. కరీంనగర్ సభలో ఏం మాట్లాడారో కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు.
ఫిబ్రవరి మూడో వారంలో తెలగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని హైదరాబాదుకు చెందిన రాష్ట్ర మంత్రి ముఖేష్ గౌడ్ అన్నారు. ఆయన శనివారంనాడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్లమెంటులో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అడ్డుకున్నా తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించారని అనడం సరి కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తన ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ముఖేష్ అన్నారు. పార్లమెంటులో బిజెపి సహకరిస్తే తెలంగాణ కచ్చితంగా వచ్చి తీరుతుందని ఆయన అన్నారు.
కాగా, ఉన్న పార్టీలతోనే తెలంగాణ బిల్లును పార్లమెంటులో అడ్డుకోవాల్సి ఉంటుందని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజమండ్రిలో మీడియాతో అన్నారు. పార్లమెంటులో బిల్లును అడ్డుకుంటామని ఆయన చెప్పారు. కొత్త పార్టీకి సమయం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగితే బిజెపి కీలకమవుతుందని ఆయన అన్నారు. సమైక్యత కోసం ఈ నెల 9వ తేదీన అన్ని ముఖ్య పట్టణాల్లో 5కె రన్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.