దొంగ, దొర ఒక్కరే, అహంకారమే: కెసిఆర్పై దామోదర
హైదరాబాద్: తమపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు తెలంగాణ పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ ఎదురుదాడికి దిగారు. దొర, దొంగ ఒక్కరేనని ఆయన కెసిఆర్ను ఉద్దేశించి అన్నారు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజలను గొర్రెలతో పోల్చడమే కెసిఆర్ దొర అహంకారానికి నిదర్శనమని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ తన జాగీరు కాదని కెసిఆర్ అన్నారని, అయితే నిజామాబాద్ సీటును కూతురు కవితకు, మెదక్ సీటును అల్లుడు హరీష్ రావుకు ఇచ్చారని, మిగిలిందంతా తనదే అని కెసిఆర్ అంటున్నారని ఆయన విమర్సించారు.

విభజనలో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీమాంధ్రను వదులుకుని, సీమాంధ్రలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తమ పార్టీ తెలంగాణ ఇచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణలోని తోడేళ్ల వంటి నేతలను తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దురహంకారంతో కెసిఆర్ ప్రజలను ఇలాగే రెచ్చగొడిే రానున్న రోజుల్లో తనగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు.
తెలంగాణ ఇవ్వాలని తాము జివోఎంను, ఆంటోనీ కమిటీని ఒప్పించామని ఆయన చెప్పారు. మాటకు కట్టుబడి తమ పార్టీ అధిష్టానం తెలంగాణ ఇచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణ ఏమైనా కెసిఆర్ తన జాగీరు అనుకుంటున్నారా అని దామోదర ప్రశ్నించారు. తెలంగాణ జిల్లాలను రాజకీయంగా కెసిఆర్ తన కుటుంబ సభ్యులకు పంచిపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కెసిఆర్ అహంకార ధోరణితో వ్యవహరిస్తు్నారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన తనపై కెసిఆర్ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన మీడియాతో అన్నారు. అలాగే వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఆయన హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తెరాసకు అభ్యర్థులు దొరకక కెసిఆర్ నిరాశానిస్పృహలకు గురై ఆ విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications