నేను కావాలా, వద్దా తేల్చుకో: పొన్నాలకు దానం, మర్రిపై నిప్పులు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో విభేదాలు కనిపిస్తున్నాయి! గురువారం గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిసి ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ భేటీలో మాజీ మంత్రి దానం నాగేందర్ లేరు. దానం గైర్హాజరుపై టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డిలు మాట్లాడారు. ఆయన కాంటాక్టులో లేరని చెప్పారు. వారి వ్యాఖ్యల పట్ల దానం మండిపడ్డారు.
తాను పార్టీలోనే ఉంటానని, కాంగ్రెస్ను వీడే ప్రసక్తి లేదన్నారు. పిలిచిన వారందరి దగ్గరకు వెళ్తే పొన్నాల ఇబ్బందుల్లో పడతారన్నారు. గ్రేటర్ అధ్యక్షుడికి చెప్పకుండా కార్యక్రమాలు ఎలా పెడతారని ప్రశ్నించారు. తాను కాంటాక్టులో లేనని చెప్పడం సరికాదన్నారు. అది అవాస్తవమన్నారు.
వారానికి ఓసారి కనబడే మర్రి శశిధర్ రెడ్డి కూడా మాట్లాడితే ఎళా అన్నారు. ఇప్పుడు సనత్ నగర్ ఉప ఎన్నికల కోసమే ఆయన కనిపిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీలో విభజించి పాలించాలని మర్రి చూస్తున్నారని మండిపడ్డారు. నేను కావాలో వద్దో పొన్నాల తేల్చుకోవాలన్నారు. అదే విషయం పొన్నాలకు చెప్పానన్నారు. మర్రి ఎక్కడ ఉంటే అక్కడ విధ్వంసమే అన్నారు.
కేసీఆర్పై మర్రి శశిధర్ రెడ్డి ఆగ్రహం
నగరంలో ఇళ్లు కట్టిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. మంత్రుల మౌఖిక ఆదేశాలతో డబ్బు వసూలు చేస్తున్నారన్నారు. తమతో దానం టచ్లో లేరని చెప్పారు. దానంపై అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పార్టీలో నుండి పోయేవాళ్లు పోతారు, ఉండేవాళ్లు ఉంటారని, ఎవరైనా వెళ్లిపోయాక మాట్లాడుతామన్నారు. కాగా, చెస్ట్ ఆసుపత్రి తరలింపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో మర్రి, అంజన్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారు: షబ్బీర్ అలీ
తమ ప్రభుత్వం వచ్చాక ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలన్నారు.
ఫిలిం సిటీలు కాదు: కిషన్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఫిలిం సిటీలు కాదని, పేదవారికి ఇళ్లు అని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి వేరుగా అన్నారు.