ఒక్క భవనం కట్టి హైటెక్ అంటున్నారు: బాబుపై దానం
హైదరాబాద్: ఒక భవనం కట్టి హైటెక్ సిటీని తానే చెప్పానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారని, ఐటిని దేశంలో అభివృద్ధి చేసింది రాజీవ్ గాంధీ అని హైదరాబాదుకు చెందిన రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో కొనసాగుతున్న చర్చలో ఆయన శనివారం పాల్గొన్నారు. విభజన సమస్య వచ్చిన తర్వాత అందరి దృష్టి హైదరాబాదుపై పడింది గానీ ఇక్కడి ప్రజలకు ఏం కావాలో ఎవరూ చెప్పడం లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్ సంస్కృతిని, వాతావరణాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాదు అంటే దేశంలోని 13 బాషలకు సంబంధించినవారు అని, వారి బాగోగులు చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. హైదరాబాదుపై రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం కావాలని తాము అడిగితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని ఆయన సీమాంధ్ర నాయకులను అడిగారు.
రేవంత్ రెడ్డిపై దానం విసుర్లు విసిరారు. రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ను వదిలేసి మల్కాజిగిరికి రావాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సోనియాను విమర్శించడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా సోనియా గాంధీ తీసుకోలేదని ఆయన అన్నారు.
హైదరాబాదులో పెట్టుబడులు పెట్టామనే వాదనను ఆయన తప్పు పట్టారు. పెట్టుబడులు ఎంత పెట్టారు, ఎన్ని లాభాలు రాబట్టుకున్నారో కూడా చెప్పాలని ఆయన అన్నారు. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని ఆయన అన్నారు. గండిపేట నీళ్లు తాగినవారు హైదరాబాద్ను విడిచి వెళ్లడానికి ఇష్టపడరని ఆయన అన్నారు.
హైదరాబాద్ ప్రజలకు 450 ఎంజిడి నీళ్లు మాత్రమే వస్తున్నాయని, హైదరాబాద్కు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్త అవసరమని ఆయన అన్నారు. అయోమయ పరిస్థితిలో ఉండి కాంగ్రెసుపై విమర్శలు చేయడం సరి కాదని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గల్లంతు కావడం ఖాయమని ఆయన అన్నారు. ప్రజలను అయోమయానికి గురి చేయవద్దని ఆయన అన్నారు.
హైదరాబాద్ ఒక్కరి జాగీరు కాదు, హైదరాబాద్ అందరిది అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇవ్వకపోతే ప్రజల్లో ఆదరణను కోల్పోతారని ఆయన తెలుగుదేశం నాయకులను ఉద్దేశించి అన్నారు. హైదరాబాదుపై అధికారాలను గవర్నరుకు ఇవ్వాలనే ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. విద్యుత్ కొరతను నివారించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.