మెట్రో ఎఫెక్ట్: రేవంత్ రెడ్డి పైన పరువు నష్టం దావా
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి పైన నాంపల్లి కోర్టులో పరువునష్టం కేసు దాఖలైంది. మైహోం అధినేత రామేశ్వర్ రావు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. నేడు పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా రామేశ్వర్ రావు స్టేట్మెంట్ను రికార్డు చేసి, సమాధానం తెలియజేయాలని రేవంత్ రెడ్డికి నోటీసులు పంపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువైన రామేశ్వర్ రావుకి హైదరాబాద్లో భూములు కేటాయించడంపై రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ తనపై చేసిన ఆరోపణల వల్ల తన పరువు పోయిందని, అందుకు రేవంత్ రూ.90 కోట్లు చెల్లించాలని రామేశ్వర్ రావు లీగల్ నోటీసులు పంపించారు.
కాగా, తెలంగాణ చిహ్నాలను అవమానించారని ఆరోపిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖర రెడ్డిలపై హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కె. గోవర్ధన్ రెడ్డి అనే న్యాయవాది బుధవారం ఈ ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును పరిశీలించిన - కేసు నమోదు చేసి, ఆరోపణలపై దర్యాప్తు జరిపి, వచ్చే ఏడాది జనవరి 12వ తేదీలోగా నివేదిక సమర్పించాలని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. తెలంగాణ ప్రజలను అవమానిస్తూ డిసెంబర్ 6వ తేదీన ఆ ఇద్దరు నాయకులు ప్రకటన, వ్యాఖ్యలు చేశారని గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదులో ఆరోపించారు.
మీడియా సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును పిచ్చివాడని, ఆయనను ఎవరూ నమ్మరని అన్నట్లు గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదులో అన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నాలుగా ప్రకటించినవాటిని అవమానిస్తూ రావుల చంద్రశేఖర రెడ్డి ప్రకటన చేశారని ఆయన అన్నారు.
ఈ ఇద్దరు నాయకులను భారత శిక్షాస్మృతిలోని 295ఎ, 504, 505 సెక్షన్ల కింద శిక్షించాలని గోవర్ధన్ రెడ్డి కోర్టును కోరారు. వారి ప్రకటనలు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాయని ఆయన అన్నారు. కాగా, ఇంతకు ముందు బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించారు.












Click it and Unblock the Notifications