జగన్కు ఊరట: జంప్ జిలానీలకు టిడిపిలో పొగ, అసహనం
విజయవాడ: పార్టీ శాసనసభ్యుల వలసల విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మహన్ రెడ్డికి కాస్తా ఊరట లభించినట్లే. రాజ్యసభ ఎన్నికల తర్వాత పార్టీ నుంచి శాసనసభ్యులు అధికార తెలుగుదేశంలోకి వలస పోవడం దాదాపుగా ఆగిపోయింది.
ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పార్టీలోకి వలసల కార్యక్రమం ఇంకా కొనసాగుతాయని టిడిపి నేతలు అంటున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, కొద్ది రోజులకు వైసిపిని ఖాళీ చేయిస్తామని రాజ్యసభ ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు కొంత మంది చెబుతూ వచ్చారు.
ప్రస్తుత శాసనసభ్యులు వైసిపిలో చివరి దాకా కొనసాగుతారా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికే ఆ పార్టీని వీడి టిడిపిలో చేరిన కొద్దిమంది ఎమ్మెల్యేల్లో అసహనం పెరుగుతోందని, ఒక అరడజను ముంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు సంకేతాలు పంపుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుకుంటున్నారు.

టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల్లో సీనియర్ రాజకీయ నాయకులు భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, సుజయకృష్ణ రంగారావు వంటి వారు ఉన్నారు. తమతమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని, అభివృద్ధిని కాంక్షించి అధికార పార్టీలో చేరుతున్నామని చెప్పారు. అయితే, వలస వెళ్లిన ఎమ్మెల్యేల్లో ఏ కొద్దిమందో జగన్ వ్యవహారశైలి నచ్చని వారున్నారు. మిగిలిన వారంతా జగన్తో సఖ్యతతో ఉన్నవారే. వీరు టిడిపిలో ఒదగలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జ్లుగా నియమించారు. ఇప్పుడు అదే నియోజకవర్గాల నుంచి వైసిపి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. తాము అధికార పార్టీలో చేరగానే నిధులు వచ్చి పడుతాయని భావించారు. కానీ అలా జరగడం లేదని అంటున్నారు. కేవలం ప్రపంచ బ్యాంక్ నిధులు, ఎన్ఆర్ఇజిఎస్ ఫండ్స్ తప్ప వేరే నిధులు రావడం లేదని చెబుతున్నారు.
అధికారుల వద్ద పనులు కూడా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిడిపి మహానాడులో కూడా వలస ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం లభించలేదు. పార్టీలో తమకు గుర్తింపు ఇవ్వడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. వైకాపా నుంచి టిడిపిలో వెళ్లిన సీనియర్ నాయకులు భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, సుజయకృష్ణ రంగారావు, జలీల్ఖాన్ మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
అయితే పుష్కరాల తర్వాత సెప్టెంబర్లో గానీ మంత్రివర్గ విస్తరణ ఉండదని అంటున్నారు. అప్పటి దాకా వారు వేచి చూడాల్సిందే. ముద్రగడ ఉద్యమంపై వైసిపి నుంచి టిడిపిలో చేరిన జ్యోతుల నెహ్రూ విమర్సలు చేయకపోవడాన్ని టిడిపి వర్గాలు తీవ్రంగా తీసుకుంటున్నాయి. ఈ స్థితిలో కొంత మంది శానససభ్యులు తిరిగి వైసిపిలో చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. జగన్ మాత్రం వారిని తిరిగి తీసుకోవడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications