ఆ విషయం ఎప్పుడో చెప్పా: ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేడి ప్రతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరంలో దిగాయి. హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తోన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. కిందటి నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల పర్వం సైతం ముగిసింది. మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ముఖ్యమంత్రి ఆతిషి సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

నేడు ఎన్నికల ప్రచారానికి తెర పడబోతోంది. ఈ పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారబరిలో దిగారు. బీజేపీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం సాగిస్తోన్నారు. ఇందులో భాగంగా రెండోరోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని, ఇటీవల దావోస్లో పర్యటించినప్పుడు కూడా ఇక్కడి అభివృద్ధి గురించి ఆర్థికవేత్తలు ఎంతో ఆసక్తిని కనపర్చారని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మున్ముందు కీలక పాత్ర పోషించబోతోందని అన్నారు.
కేంద్ర బడ్జెట్ సైతం ఆదే విషయాన్ని ప్రస్ఫూటింపజేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టిందని అన్నారు. 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపును చంద్రబాబు సమర్థించారు. ఈ బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలో పేదరిక నిర్మూలన చేస్తోందని కితాబిచ్చారు.
జనం కురచబుద్ధితో ఆలోచిస్తోన్నారని, విశాల దృక్పథాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. అప్పుడే పురోగమనం సాధ్యపడుతుందని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ విషపూరితమైందని, ఇక్కడ రాజకీయ కాలుష్యం సైతం బాగా పెరిగిందని చంద్రబాబు అన్నారు. రెండూ ఆరోగ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో మంచినీటికి మురుగునీటికి తేడా ఉండట్లేదంటూ చంద్రబాబు ఆరోపించారు. కేజ్రీవాల్ పాలనలో యమునా నది అత్యంత కలుషితంగా మారిందని, పదేళ్లల్లో ఆప్ ప్రభుత్వం ఢిల్లీ కాలుష్యాన్ని నియంత్రించలేకపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే ఇవన్నీ చేయగలదంటూ ధీమా వ్యక్తం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పందంగా ఉందని, అన్ని స్కామ్లతో పోలిస్తే మద్యం కుంభకోణం అత్యంత దారుణమని చెప్పారు. ఈ మోడల్ దేశానికి ఏ మాత్రం మంచిది కాదని, దీనిపై ఇప్పటి నుంచే చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రపంచంలో కమ్యూనిజం అంతమైందనే విషయాన్ని ఎప్పుడో చెప్పానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కమ్యూనిజం లేదని, ఉండేదంతా టూరిజం మాత్రమేనని పునరుద్ఘాటించారు. సిద్ధాంతానికి- అభివృద్ధికి చాలా తేడా ఉందని, లెఫ్టిస్టుగా ఉంటే లెఫ్ట్లోనే ఉంటారని, అభివృద్ధి, సంపదను సృష్టించాలనుకుంటేనే రైటిస్ట్ సిద్ధాంతాలు అవసరమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications