పవన్ కల్యాణ్కు వెన్నునొప్పి.. అయినా
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. వారాహి దీక్ష తుదిదశకు చేరుకుంటోంది. 11 రోజుల ఈ దీక్షలో ఎనిమిది రోజులు ముగిశాయి. ఈ ఆది/సోమవారాల్లో దీక్షను విరమించే అవకాశాలు ఉన్నాయి. దీక్షలో ఉంటూనే తన బాధ్యతలను నిర్వహిస్తోన్నారు. కాకినాడ జిల్లా సహా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఇటీవలే పర్యటించారు.
వారాహి ఏకాదశ దిన దీక్షలో భాగంగా నేడు సూర్యారాధనను నిర్వహించారు పవన్ కల్యాణ్. సమాజం, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధాన ఆచరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదిత్య యంత్రాన్ని వేసి, దానికి ప్రత్యేక పూజలను నిర్వహించారాయన. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సూర్య భగవానుడిని ఆరాధించారు.

కొంతకాలంగా పవన్ కల్యాణ్ వెన్ను సంబంధిత ఇబ్బందితో సతమతమౌతున్నారు. ఫలితంగా సూర్య నమస్కారాలు చేయట్లేదు. దీనికి ప్రతిగా సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్రసహిత ఆరాధనను నిర్వర్తించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మ ఈ ఆరాధన విశిష్టతను వివరించారు.
సమాజ వికాసం, సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధన చేయాలని, ఇది ప్రజల జీవన విధానంలో అంతర్భాగమేనని పండితులు వివరించారు. పురాణేతిహాసాల్లో సూర్యారాధన ప్రస్తావన ఉందని గుర్తు చేశారు. వనవాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవానుడిని ప్రార్థించి అక్షయ పాత్ర పొందారని మహా భారతం చెబుతోందని పేర్కొన్నారు. శ్రీమహా విష్ణువు సూర్యభగవానుడి నుంచి సుదర్శన చక్రాన్ని పొందాడని అన్నారు.
బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయిందని, హైందవ సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉందని పండితులు వివరించారు. గతంలో పెద్దలు ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారని, అందుకే ఆదివారాన్ని కృషి వారం అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications