పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు
జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ ప్రజాప్రతినిధులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం విజయవాడలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం వేదికగా పవన్ కల్యాణ్ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కొందరు నేతల తీరు వల్ల పార్టీ గౌరవం మంటగలుస్తోందని, అవినీతి ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించే వరకు పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటున్నారని సూటిగా నిలదీశారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలను ఆసరాగా చేసుకుని, యాజమాన్యాలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన మండిపడ్డారు.

"రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి మేము ఎంతో కష్టపడుతుంటే.. మీరు ఇలాంటి పనులకు పాల్పడటం ఏంటి? మిమ్మల్ని నమ్మి టికెట్లు ఇచ్చింది వసూళ్లు చేయడానికా?" అంటూ పవన్ నిప్పులు చెరిగారు. ఇండస్ట్రీల నుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ.. ఇలాంటి చర్యలు పార్టీ పరువు తీయడమేనని తేల్చి చెప్పారు.
సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యం ఎందుకు?
పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో కొందరు ప్రజాప్రతినిధులు వెనుకబడటంపై కూడా పవన్ కల్యాణ్ క్లాస్ తీసుకున్నారు. "సభ్యత్వ నమోదు ఎందుకు చేయలేకపోతున్నారు? వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడగాలంటే మన బలం పెరగాలి కదా?" అని ప్రశ్నించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవనే సంకేతాలను పంపారు.
Pawan Kalyan హెచ్చరిక.. మార్పు రాకపోతే అంతే!
ఎంత చెప్పినా కొందరిలో మార్పు రాకపోవడంపై పవన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్న తరుణంలో, సొంత పార్టీ నేతలే వివాదాలకు కేంద్రబిందువు కావడం పవన్ను ఇబ్బందికి గురి చేస్తోంది. "మారతారా? లేక చర్యలు తీసుకోవాలా?" అనే రీతిలో పవన్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు జనసేన క్యాడర్లో హాట్ టాపిక్గా మారాయి.












Click it and Unblock the Notifications