రక్తసిక్తమైన దేవరగట్టు 'బన్ని ఉత్సవం': ఐదుగురి పరిస్థితి విషమం
అమరావతి: కర్నూలు జిల్లా దేవరగట్టు గ్రామంలో జరిగే 'బన్ని ఉత్సవం'లో ఈసారి ఎలాగైనా రక్తపాతాన్ని ఆపాలనుకున్న ఆ జిల్లా ఎస్పీ రవికృష్ణ ఆశయం నెరవేరలేదు. ప్రతి ఏటా దసరా రోజున జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగిన కర్రల సమరం రక్తసిక్తంగా మారింది.
ప్రతి ఏటా దసరా రోజున కర్రలు చేతబట్టి దేవర విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు పలు గ్రామాలకు చెందిన యువత మధ్య పోరాటం చోటుచేసుకోవడం అక్కడ ఆనవాయతీ. ఈ పోరులో వాడే కర్రల చివర ఇనుప కమ్మీలు తొడగడం, మద్యం సేవించి ఉత్సవంలో పాలుపంచుకోవడం తదితర కారణాలతో ఏటా రక్తం చిందుతోంది.
ఈ ఏడాది రక్తపాతాన్ని నివారించాలని జిల్లా ఎస్పీ రవికృష్ణ విశ్వయత్నం చేశారు. కర్రల చివర ఇనుప కమ్మీలు లేకుండా చూడటంతో పాటు మద్యం సేవించిన వారిని పోరుకు దూరంగా ఉంచాలని ఆయన గ్రామస్థులకు సూచించారు. అంతేకాక దాదాపు వెయ్యి మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారు.
అయినా సరే గురువారం జరిగిన బన్ని ఉత్సవంలో గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. మద్యం మత్తులో యువత రెచ్చిపోయింది. గురువారం జరిగిన కర్రల సమరంలో 30 మందికిపైగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించింది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.