కెసిఆర్ అసమర్థత వల్లే కరెంటు కష్టాలు: దేవినేని
విజయవాడ: తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అసమర్థతే కారణమని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తీరు ఆడలేక మద్దెల ఓడన్నట్లుందని ఎద్దేవా చేశారు.
తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త రాష్ట్రంపై నిందలు మాని కేసీఆర్ తెలంగాణ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఆయన హితవు చేశారు. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని సిఎం చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారని మంత్రి దేవినేని ఉమా చెప్పారు.
ఏడిబి ప్రతినిధులతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: ఏడిబి ప్రతినిధులతో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. విశాఖపట్నం-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఏడిబి సహకారం కోరారు. పారిశ్రామిక హబ్లుగా విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, శ్రీకాళహస్తిల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. కాగా, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్లో 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఏడిబి అంగీకరించింది.