యజ్ఞాలకు రాక్షసులు అడ్డుపడ్డట్లుగా: జగన్పై దేవినేని ఆగ్రహం
పురాణాల్లో యజ్ఞాలకు రాక్షసులు అడ్డుపడ్డట్లుగా ఇప్పుడు ప్రాజెక్టులకు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు.
విజయవాడ: పురాణాల్లో యజ్ఞాలకు రాక్షసులు అడ్డుపడ్డట్లుగా ఇప్పుడు ప్రాజెక్టులకు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు.
పట్టిసీమపై చేసిన వ్యాఖ్యలకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ కడుతుంటే కోర్టులలో కేసులు వేయించి, రైతులను వైసిపి నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
ఉభయ గోదావరి జిల్లాల రైతులు వైసిపి నేతల మాటలను తిప్పికొడుతున్నారని, పట్టిసీమ ద్వారా రూ.8వేల కోట్ల పంట వచ్చి రైతులు లబ్ధి పొందారన్నారు.
దీని ద్వారా రూ.10 వేల కోట్ల పంట రావాలని కోరుకుంటున్నామని దేవినేని ఆకాంక్షించారు. సుజల స్రవంతిలో ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తామని, కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల అధికారులు కూర్చొని చర్చించుకుంటారన్నారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 880 అడుగులకు, సాగర్లో నీటిమట్టం 518 అడుగులకు చేరిందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో 10 టీఎంసీలు, తుంగభద్ర జలాశయంలో 81 టీఎంసీలు నీరు నిల్వ ఉందని, పట్టిసీమకు 71 టీఎంసీలకు పైగా నీరు విడుదల జరిగిందని, ప్రకాశం బ్యారేజీకి 60కి పైగా టీఎంసీల నీరు వచ్చిందన్నారు.