వారికి మింగుడు పడకపోతే చంద్రబాబే...: దేవినేని నెహ్రూ వ్యాఖ్యలు
విజయవాడ: తాను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కొంత మంది శాసనసభ్యులు హాజరు కాకపోవడంపై మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వారు హాజరు కాకపోవడంపై తనకేమీ సంబంధం లేదని అన్నారు.
తాను టిడిపిలో చేరడం వారికి మింగుడు పడకపోతే వాళ్ల గొంతుల్లో నీళ్లు పోసి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే మింగుడు పడేలా చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తనను నమ్ముకుని చాలా మంది పార్టీలోకి వచ్చారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు.
చంద్రబాబు నాయుడు తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తానని ఆయన సోమవారం మీడియాతో అన్నారు. దేవినేని నెహ్రూతో పాటు ఆయనయ కుమారుడు దేవినేని అవినాష్ ఇటీవల చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
నెహ్రూ టిడిపిలో చేరడానికి ఏర్పాటైన సభకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశి, మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, మరికొంత మంది హాజరు కాలేదని వార్తలు వచ్చాయి. దేవినేని నెహ్రూను పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేకనే వారు సభకు హాజరు కాలేదనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి.