లెక్కలు చెప్పాలి: టీ మంత్రులకు దేవినేని ఉమ సవాల్
విజయవాడ: నాగార్జున సాగర్ నుంచి కృష్ణా నదీ జలాల విడుదలపై తెలంగాణ మంత్రులు చేస్తున్న ప్రకటనలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటికి కోసం నీటిని విడుదల చేస్తే రాద్ధాంతం ఎందుకని ఆయన అడిగారు. నీటి విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనవసరమైన అపోహలు కలిగిస్తోందని ఆయన అన్నారు.
తాగునీటి అవసరాల కోసమే నీటిని అడిగామని, నారుమళ్లకు నీటిని మళ్లిస్తున్నారనే తెలంగాణ మంత్రుల మాటల్లో నిజం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కృష్ణానది నిర్వహణా బోర్డు నిర్ణయం మేరకే నీరు విడుదలవుతోందని ఆయన చెప్పారు. విభజన సమయంలో జరిగిన ఒప్పందాల మేరకే నీటి విడుదల జరుగుతున్నట్లు దేవినేని ఉమ చెప్పారు.

గత 9 రోజుల్లో విడుదల అయిన నీరు కేవలం 4.02 టిఎంసిలు మాత్రమేనని, కృష్ణా బ్యారేజీకి చేరింది 1.42 టిఎంసిల నీరు మాత్రమేనని ఆయన అన్నారు. ఇది కేంద్ర జల సంఘం ఇచ్చిన లెక్కల ప్రకారమేనని ఆయన అన్నారు. ఎంత నీరు విడుదలైంది, ఎంత చేరింది అనే విషయాలపై లెక్కలుంటే తెలంగాణ మంత్రులు చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు.
నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలనే కృష్ణా నిర్వహణ బోర్డు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. తొలుత వారం రోజుల పాటు నీరు విడుదల చేసి, దాన్ని పొడగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications