ఏపీకి సీఎం విజయసాయి రెడ్డా..? జగన్మోహన్ రెడ్డా..? విశాఖలో దందాల సంగతేంటి : దేవినేని ఉమా
రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చి వేలాది మంది రైతులు చేసిన త్యాగాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. మీకు రాజధాని నీళ్లు పడలేదనో.. వాతావరణం నచ్చలేదనో రాజధానిని మార్చేస్తారా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబును తిట్టేందుకే కేబినెట్ భేటీలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దందాలను తాను బయటపెట్టానని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు..?
ఒక పోలీస్ కమిషనర్ను,ఒక కలెక్టర్ను పక్కనపెట్టుకుని విజయసాయి రెడ్డి రాజధానిపై ఎలా ప్రకటన చేస్తారని మండిపడ్డారు. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డా..? లేక జగన్మోహన్ రెడ్డా..? అని ప్రశ్నించారు. దొంగ లెక్కలు రాసి జైలుకు వెళ్లినవాడు రాజధానిపై ప్రకటన చేయడమేంటని విమర్శించారు.
విశాఖలో గత ఏడు నెలలుగా మంత్రులు,వైసీపీ ఎమ్మెల్యేలు,నేతలు భారీ స్థాయిలో ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడ్డారని ఆరోపించారు. దాదాపు 36వేల ఎకరాల ఇన్సైడ్
ట్రేడింగ్ జరిగిందన్నారు.

13 ఎకరాలు కాజేసేందుకు..
కడప జిల్లాకు చెందిన సుబ్బారాయుడు అనే వ్యక్తి వాల్తేరు క్లబ్ మేనేజ్మెంట్ పరిధిలోని 13 ఎకరాలు అప్పగించాలని ఆ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాడని దేవినేని ఆరోపించారు. ఎవరి అండ చూసుకుని,ఎవరి ధైర్యం చూసుకుని సుబ్బారాయుడు అనే వ్యక్తి నోటీసులు ఇచ్చాడని ప్రశ్నించారు.పేదలకు చెందిన
ఆ భూములను అప్పనంగా కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

సీబీఐ దర్యాప్తుకు డిమాండ్
విశాఖపట్నంలోని టైకూన్ రెస్టారెంట్ సమీపంలో క్రిస్టియన్ సంస్థకు చెందిన 3.9 ఎకరాలపై వైసీపీ నేతల కన్ను పడిందన్నారు. భీమిలి,భోగాపురం ప్రాంతాల్లో దాదాపు
6వేల ఎకరాలు చేతులు మారాయని ఆరోపించారు. విశాఖలో వైసీపీ నేతల దందాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

అది సిగ్గుచేటు కాదా..?
గత 11 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తుంటే బాధ్యతగల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
ఆఖరికి గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సచివాలయం నేరుగా వెళ్లేందుకు భయపడి.. ముందుగా ట్రయల్ రన్స్ నిర్వహించారని విమర్శించారు. ప్రభుత్వానికి
ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా..? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications