తిరుమల ఘాట్ రోడ్లో భయం భయం- కెమెరాలో చిక్కిన వైనం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 58,548 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,297 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.80 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 23 కంపార్ట్మెంటల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

తిరుమల ఘాట్ రోడ్లో తాజాగా ఏనుగుల గుంపు కనిపించడం భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. అలిపిరి మార్గంలో చిరుతల సంచారం తగ్గిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏనుగులు తిరుగాడుతోండటం కలవర పెడుతోంది. శుక్రవారం రాత్రి ఏడో మైలు ఘాట్లో ఏనుగులు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తిరుమలకు అతి సమీపంలో ఏనుగులు సంచరిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు నుంచి మూడు ఏనుగు గుంపులు ఉండొచ్చంటూ అధికారులు అనుమానిస్తోన్నారు. వేసవి ఆరంభమైన నేపథ్యంలో ఆహారం, నీటి కోసం ఇవి జనావాసాలకు సమీపిస్తోన్నాయని అంచనా వేస్తోన్నారు.
గతంలో పారువేట మండపం, గోగర్భం రిజర్వాయర్, శ్రీగంధం వనం, కాకులకొండ, అవ్వాచారి కోన సమీపంలో ఏనుగులు సంచరించాయి. ఇప్పుడు ఘాట్ రోడ్డుకు సమీపించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇవి- తిరుమల, ఘాట్ రోడ్లు, కాలి నడక మార్గాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటోన్నారు.
అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి ఏనుగులు రాకుండా రెయిలింగ్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ గతంలో టీటీడీ భావించిన విషయం తెలిసిందే. అయిదు నుంచి ఆరు అడుగుల ఎత్తులో రెండు వరసలతో రెయిలింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఏనుగులు తిరుమల జనావాసాల్లోకి రావంటూ అభిప్రాయపడింది. దీనిపై ఎలాంటి కార్యాచరణ అమలు కాలేదు అప్పట్లో.












Click it and Unblock the Notifications