కడపలో నేనైనా గెలుస్తా, ఇక్కడ జగన్కు ఈజీ కాదు: ధర్మాన సంచలనం
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎన్నికల్లో గెలుపు విషయమై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
సొంత జిల్లా కడపలో వైయస్ జగన్ గెలుపు చాలా సులువు అని ధర్మాన చెప్పారు. అదే జగన్ శ్రీకాకుళంలో నిలబడితే మాత్రం గెలుపు అంత ఈజీ ఏమీ కాదని పేర్కొన్నారు. అనుకూలంగా ఓటు వేసే వారి సంఖ్య కడపలో అధికంగా ఉన్నందునే జగన్ తన జిల్లాలో భారీ మెజారిటీతో గెలుస్తున్నారన్నారు.
బుధవారం శ్రీకాకుళంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ధర్మాన మాట్లాడారు. ఆయన ఆవేశంగా మాట్లాడారు. కడపలో 26 శాతం ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని, అలాగే రెడ్లు, క్రిస్టియన్లు, మైనారిటీ వర్గాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. అందువల్ల కడపలో జగనే కాకుండా ఎవరు పోటీ చేసినా గెలవరన్నారు.
అక్కడ నేను పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలవగలనని, కుల సమీకరణాల పరంగా వైసిపికి అనుకూలంగా ఆరు జిల్లాలే ఉన్నాయని, మిగతా జిల్లాల్లో ఇతర పార్టీలకు ఆకర్షితులైన వర్గాలు అధికంగా ఉన్నందున వైసిపి తరఫున ఎవరు పోటీ చేసినా గెలవడం కష్టమే అన్నారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కుల సమీకరణలు వేరుగా ఉన్నాయన్నారు. ఇక్కడ వెనుకబడిన బీసీ వర్గాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కాళింగ, కాపు, వెలమ ఇతర సామాజిక వర్గాల ప్రభావం చాలా అధికమన్నారు. ఇక్కడ ఎవరు పడితే వారు గెలవడం సాధ్యం కాదన్నారు.
అందుకే జగన్ శ్రీకాకుళం వచ్చి నిలిస్తే గెలవడం ఈజీ కాదని, నేను తెలుగుదేశం పార్టీలో చేరి పోటీకి దిగినా కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచిన వారిని దగ్గరకు తీసుకోవడం, ఓడిన వారిని దూరంగా పెట్టడం జగన్కు అలవాటైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జగన్ వైఖరి మారాల్సి ఉందన్నారు.