ఏలూరు జేసీ, ఎస్పీలుగా భార్యాభర్తలు..! సర్కార్ అనూహ్య ఎంపిక..
ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమ ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తోంది. వీరిలో పలువురు జిల్లా కలెక్టర్లు, జేసీలు, కార్యదర్శులు, ఎస్పీలు ఉన్నారు. అయితే వీరిలో ఓ ఇద్దరి ఎంపిక మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. అది ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్పీ ఎంపిక. వీరిద్దరూ భార్యాభర్తలు కావడమే ఇందుకు కారణం. దీంతో ఇప్పుడు ఈ దంపతులు ఏలూరు జిల్లాను పాలించబోతున్నారన్నమాట.
ఏపీ ప్రభుత్వం తాజా బదిలీల్లో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పి.ధాత్రి రెడ్డిని నియమించింది. అలాగే జిల్లా ఎస్పీగా కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ను నియమించింది. పాడేరు జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న ధాత్రి రెడ్డి ఏలూరు జిల్లాకి జాయింట్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్ల బావి గ్రామానికి చెందిన ధాత్రి రెడ్డి..
2019లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఐపీఎస్ శిక్షణ సమయంలో మళ్లీ సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 46వ ర్యాంక్ సాధించారు. దీంతో ఐఏఎస్కు ఎంపికయ్యారు. అంతకు ముందు డచ్ బ్యాంక్లో పని చేసిన ఆమె.. ఐఐటీ ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్.

అలాగే ఆమె భర్త, ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ కిషోర్ సైతం ఐఐటీ ఖరగ్పూర్లో చదువుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ యువ ఐపీఎస్.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలోనే ప్రధాని సిల్వర్ కప్ అందుకున్నారు. సమర్ధుడైన యువ అధికారిగా పేరు తెచ్చుకున్న ప్రతాప్ శివ కిషోర్ ను తాజాగా ప్రభుత్వం ఏలూరు జిల్లా ఎస్పీగా నియమించింది. ఇలా భార్యాభర్తలు ఒకే జిల్లాకు ఐఏఎస్, ఐపీఎస్ లుగా సేవలు అందించనున్నారు.












Click it and Unblock the Notifications