చిరు ప్లాన్కు పవన్ కళ్యాణ్ ఎసరు: జగన్పై దెబ్బ?
హైదరాబాద్: సీమాంధ్రలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని భారీగా దెబ్బ తీసింది కాపు సామాజిక వర్గమేనని భావిస్తున్నారు. చిరంజీవి సారథ్య బాధ్యతల వల్ల ఆ సామాజిక వర్గం ఓట్లను తాము పొందవచ్చునని కాంగ్రెసు అధిష్టానం భావించింది. అయితే, వైయస్ జగన్ వైపు రెడ్డి సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడివైపు కమ్మ సామాజిక వర్గం వెళ్తుందని, అధికారం కోసం చూస్తున్న కాపు సామాజిక వర్గం తమవైపు ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని ముందు పెట్టినట్లు సమాచారం.
చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి, దూకుడుగా ముందుకు వచ్చి బిజెపిని, తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో కాంగ్రెసు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దానికితోడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఏకం కావడంతో రెండు సామాజిక వర్గాలు ఒక్కటై వైయస్ జగన్ను కోలుకోలేని దెబ్బ తీశాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డున్నది వైయస్ రాజశేఖర రెడ్డే అనే ఆగ్రహం కూడా పనిచేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చాలా నియోజకవర్గాల్లో కాపులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓట్లు వేయలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరు లోకసభ స్థానాల్లో కాపు అభ్యర్థులను దింపింది. వారు ఆరుగురు కూడా ఓటమి పాలయ్యారు. తక్కువ ఆధిపత్యం గల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు వారిపై విజయం సాధించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని 19 శాసనసభా స్థానాల్లో కేవలం ఐదు సీట్లనే గెలుచుకుంది. ఉభయ గోదావరి జిల్లాలోని 34 సీట్లలో వైయస్సార్ కాంగ్రెసు ఐదు సీట్లకు పరిమితమైంది.
అలాగే, 16 శాసనసభా స్థానాలున్న కృష్ణా జిల్లాలో ఐదు సీట్లను, 17 స్థానాలున్న గుంటూరు జిల్లాలో ఐదు సీట్లను వైయస్సార్ కాంగ్రెసు గెలుచుకుంది. ఈ రెండు జిల్లాల్లోని 33 సీట్లలో పది సీట్లను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంది. నాలుగు జిల్లాల్లోని 67 సీట్లలో 15 సీట్లకు ఆ పార్టీ పరిమితమైంది. కాపులు అధికంగా ఉన్న జిల్లాల్లో సగం సీట్లను గెలుచుకున్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది.